Sampark Kranti Express: 


సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన..


తమిళనాడులో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో (Sampark Kranti Express) జనరల్‌ కోచ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కి వెళ్తున్న రైల్లో ఉన్నట్టుండి ఓ వ్యక్తి కుప్ప కూలిపోయాడు. పల్స్ పడిపోయింది. ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం చేయాలో అర్థంకాక అలాగే ఉండిపోయారు. దాదాపు 600 కిలోమీటర్ల మేర ఆ డెడ్‌బాడీతోనే ప్రయాణించారు. మధ్యలో రైల్వే అధికారులకు సమాచారం అందించినా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్‌కి వచ్చాక కానీ ఆ మృతదేహాన్ని రైల్లో నుంచి దింపలేదు. అప్పటి వరకూ అలా శవంతోనే ప్రయాణం చేశారు ప్యాసింజర్స్. యూపీలోని బండా జిల్లాకి చెందిన 36 ఏళ్ల రామ్‌జీత్ యాదవ్‌ చెన్నైలో పని చేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా బండాకి తిరుగు ప్రయాణమయ్యాడు. నాగ్‌పూర్‌కి చేరుకునే సమయానికి మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఏమైందో అని గమనించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. భోపాల్‌కి చేరుకునే సమయానికే రైల్వే అధికారులకు ప్రయాణికులు సమాచారం అందించారు. డెడ్‌బాడీని తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేశారు. కానీ అధికారులెవరూ స్పందించలేదు. ఝాన్సీ స్టేషన్‌కి చేరుకున్నాక అప్పుడు ఆ మృతదేహాన్ని కిందకు దించారు. 


రైల్వే ప్యాంట్రీలో ఎలుకలు 


రైల్వే ప్యాంట్రీలో ఎలుకలు తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడి ఆహారా పదార్థాలపై నుంచి ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. ఓ ప్రయాణికుడు ఈ వీడియో తీసి పోస్ట్ చేశాడు. అక్టోబర్ 15న రైల్లో ప్రయాణించే సమయంలో ఈ వీడియో తీసినట్టు చెప్పాడు ఆ నెటిజన్. ఇలాంటి ఘటనలు చూసి రైల్వేపై గౌరవం పోతోందని అసహనం వ్యక్తం చేశాడు. రైల్ జర్నీపై ఉన్న ఇష్టంతో వీడియో తీస్తుంటే ఉన్నట్టుండి ఇలా ఎలుకలు కనిపించాయని పోస్ట్ చేశాడు. రైల్వే పోలీస్ ఫోర్సెస్ (RPF)కి కంప్లెయింట్ ఇచ్చాడు ప్యాసింజర్. కానీ...ఊహించని రీతిలో బదులు వచ్చింది. రైల్వే ట్రాక్‌ల కింద చాలా ఎలుకలున్నాయని చెప్పింది. ఆ తరవాత అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్యాంట్రీ మేనేజర్‌ దగ్గరికీ వెళ్లాడు. కానీ...వాళ్ల సమాధానం మరింత అసహనానికి గురి చేసింది. "ఎలుకలుంటే మేమేం చేయగలం.." అని బదులిచ్చారు వాళ్లు. ఆ తరవాత IRCTC స్పందించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్యాంట్రీ కార్‌లను హైజీన్‌గా ఉంచాల్సిన బాధ్యత తమదే అని స్పష్టం చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. 


"నేను రైళ్లలో నిత్యం ట్రావెల్ చేస్తూ ఉంటాను. ట్రైన్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. అక్టోబర్ 15న నేను ట్రైన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు అంతా వీడియో తీయాలని అనుకున్నాను. అన్నిచోట్లా షూట్ చేస్తుంటే ప్యాంట్రీలో ఎలుకలు కనిపించాయి. దాదాపు 6-7 ఎలుకలు అక్కడి ఆహార పదార్థాలపై తిరిగాయి"


- ప్యాసింజర్ 


Also Read: Delhi Pollution: ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, స్కూల్స్‌కి ముందుగానే వింటర్ బ్రేక్