Peddapalli News : పెద్దపల్లిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కిరోసిన్ ఒంటి మీద పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ ఇల్లంతకుంట మండలం  గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేష్, తండ్రి మల్లయ్య కళాకారునిగా పనిచేసి ఈ మధ్యనే మృతిచెందారు. ఆ కుటుంబం రోడ్డున పడడంతో రమేష్.. సీఎం కేసీఆర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. 


వినతి పత్రంలో ఏముందంటే? 


"సార్, నేను తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని ఇల్లందుకుంట గ్రామంలో నివసిస్తున్నాను. మా నాన్నగారు పెరుమాండ్ల మల్లయ్య కళాకారుడిగా జీవితం కొనసాగిస్తూ ఇటీవల షుగర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. మా నాన్నగారి మరణం తట్టుకోలేక అమ్మకు పక్షవాతం వచ్చి మంచాన పడింది. దీని వల్ల మా కుటుంబం రోడ్డున పడింది. నిరుపేద బిడ్డనైన నేను రోజు వారీ కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను బీ.ఈడీ వరకు చదువుకున్నప్పటికీ విధి వెక్కిరించి ఉద్యోగం రాలేదు. కావున మీరు అప్పులపాలైన మా కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కొంత ఆర్థిక సాయాన్ని అందించి, నాకు ప్రభుత్వ పరంగా చిరు ఉద్యోగాన్ని కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నాను. " - పెరుమాండ్ల రమేష్ 


పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభం 


పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ కొత్త కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు.  కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ ఛాంబర్‌ సీట్‌లో కలెక్టర్‌ సంగీతను కూర్చొబెట్టారు. అంతకు ముందు కలెక్టరేట్‌ వద్ద పోలీసుల నుంచి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో 22 ఎకరాల్లో  కలెక్టరేట్ భవనాన్ని రూ.48.07 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ భవనంలో 6 బ్లాకులు, 98 గదులు ఉన్నాయి. భవన సముదాయంలో 41 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. గ్రౌండ్ ఫోర్‌లో సంక్షేమం, మత్య్స శాఖ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు శాఖల ఛాంబర్లు ఉన్నాయి.  


Also Read : Nirmal News : రాజకీయ నేతలు బీఅలెర్ట్, సివిల్ డ్రెస్ లలో మావోల సంచారం!


Also Read : CM KCR : గోల్ మాల్ ప్రధాని గుజరాత్ మోడల్ పేరుతో మోసం చేశారు - సీఎం కేసీఆర్