6 Years Old Girl Was Abused By An Old Man In Erpedu: వారం రోజుల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం. విజయనగరం జిల్లాలో ఊయలలో 6 నెలల పసికందుపై వరుసకు తాత అయ్యే వ్యక్తి అఘాయిత్యం. ఈ ఘటనలు మరువకు ముందే 6 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం ఈ దారుణం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మూలకండ్రిగ గ్రామంలో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై బలరామయ్య అనే వృద్ధుడు కన్నేశాడు. బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి తన వెంట తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె నొప్పితో విలవిలలాడడంతో జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించి వదిలిపెట్టాడు. 


వైద్యులకు చూపించగా..


అదే రోజు సాయంత్రం బాలిక నొప్పితో బాధ పడుతుండగా గమనించిన తల్లి స్థానిక ఆర్ఎంపీ వైద్యునికి చూపించారు. రెండు రోజులైనా నొప్పి తగ్గకపోవడంతో తల్లిదండ్రులు రేణిగుంటలోని ప్రైవేట్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాపపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్‌కు గురై.. నెమ్మదిగా బాలిక నుంచి విషయం తెలుసుకున్నారు. వృద్ధుడు అత్యాచారం చేసినట్లు చెప్పగా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. విషయం బయటకు తెలియడంతో నిందితుడు పరారయ్యాడు. నిందితునిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.


పసికందు కుటుంబానికి పరామర్శ


అటు, విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో ఊయలలోని 6 నెలల పసికందుపై వరుసకు తాత అయ్యే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. చిన్నారిపై 40 ఏళ్ల మానవమృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి నిందితునికి ఏ న్యాయవాది కూడా బెయిల్ కోసం వెళ్లకూడదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. కాగా, ఊయలలోని పసికందుపై వృద్ధుడు శనివారం అత్యాచారం చేయగా.. గుర్తించిన చిన్నారి అక్క తల్లికి విషయం చెప్పింది. తల్లితో సహా గ్రామస్థులు నిందితున్ని పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


తెలంగాణలోనూ దారుణం


అటు, తెలంగాణలోనూ ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న ఓ మహిళ అల్వాల్ నుంచి యాప్రాల్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఒంటరిగా ప్రయాణిస్తోన్న ఆ మహిళను ఆటో డ్రైవర్.. వెంకట్రావుపేటలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మరో ఇద్దరితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు బొల్లారం పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.