Armur Crime News: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో పది రోజుల క్రితం జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అతని వద్ద పని చేసే వాళ్లే నిందితులు అని తేల్చారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పారిపోయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే నిందితుల నుంచి 18 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 


అసలేం జరిగిందంటే..?


ఆర్మూర్ పట్టణంలో గతనెల 30, ఈనెల 1వ తేదీన రెండు వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీల్లో సుమారు 300 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దొంగలు దొరికారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరు పారిపోయినట్లు వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఓ వీధిలో బెంగాలీ యువకుడు బుయా అంజన్ బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి వద్దే ఆయన ఈ పని చేస్తుంటాడు. అయితే ఇంట్లో ఎక్కువగా బంగారం ఉన్న విషయాన్ని గుర్తించిన పని వాళ్లు.. మహారాష్ట్రలో ఉన్న తమ స్నేహితులకు తెలిపారు. ఎలాగైనా సరే ఆ బంగారాన్ని కొట్టేయాలని పథకం పన్నారు. 




ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన దీపేష్, రాకేష్ గుప్తా, మాలి యామాజి, మరో బాల నేరస్తుడు కలిసి ఆర్మూర్ కు చేరుకున్నారు. వచ్చిన రోజే అంజన్ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 30 తులాల బంగారాన్ని దొంగిలించారు. అనంతరం హైదరాబాద్ చేరుకొని మహారాష్ట్ర పారిపోవాలని ప్లాన్ వేశారు. అయితే ఇంట్లో దొంగతనం జరిగిన విషయం గుర్తించిన అంజన్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే వెళ్లి నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడైన మాలి యామాది పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 18 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మిగిలిన బంగారం ప్రధాన నిందితుడు మాలి యామాజి వద్ద ఉన్నట్లు నిందితులు చెప్పారని సీపీ నాగరాజు వెల్లడించారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని కూడా పట్టుకుంటామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ పోలీసులను సీపీ నాగరాజు అభినందించారు. రివార్డులను కూడా అందజేశారు.


వనస్థలిపురంలో దోపిడీ కేసు..


శుక్రవారం రాత్రి వనస్థలిపురంలో ఓ దోపిడీ కేసు వెలుగుచూసింది. వనస్థలిపురంలోని ఎంఆర్ఆర్ బార్ యాజమాని కలెక్షన్ సొమ్ముతో ఇంటికి బయల్దేరాడు. గుర్తు తెలియని దుండగులు తనను ఫాలో అయ్యి..వెంకట్రామిరెడ్డి బైకును ఢీకొట్టి డబ్బుతో ఎస్కేప్ య్యారనేది స్టోరీ. దోచుకెళ్లిన సొత్తంతా బారు లావాదేవీలకు సంబంధించిందేనని అంతా అనుకున్నారు. బట్..ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ ఇంత భారీ మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఎలా ఉంటుందని పోలీసులకు డౌట్ వచ్చింది.కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు తనదైన స్టైల్లో విచారణ మొదలు పెట్టారు. బాధితుడికి తెలిసిన వ్యక్తులే ఇదంతా చేశారనే అంచనాకు వచ్చారు. దర్యాప్తులో బార్ ఓనర్ వెంకట్రామిరెడ్డి కాల్ డేటా, వాట్సప్ హిస్టరీపై ఓ కన్నేశారు. అప్పుడు అసలు గుట్టు బయటపడింది. హవాలా బాగోతం వెలుగులోకి వచ్చింది. బార్ ఓనర్ వాట్సప్ ఆధారంగా హవాలా లింకులు గుర్తించారు పోలీసులు. ఓల్డ్ సిటీకి చెందిన ఫరూఖ్ తో కలిసి వెంకట్రామిరెడ్డి హవాలా చేస్తున్నాడని గుర్తించారు.