Nizamabad News: నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా యువతి  తరపు సమీప బంధువులు... ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఎరుగట్ల మండల కేంద్రానికి చెందిన మాసం వంశీకృష్ణ అదే గ్రామానికి చెందిన శ్రీజ గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే ఎలాగైనా సరే తాము పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇద్దరూ ఎవరికీ తెలియకుండా వెళ్లి ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. అనంతరం రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించి మరీ పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం అమ్మాయిని.. అబ్బాయితో పాటు అతని ఇంటికి పంపించారు. 


రెండు నెలల వరకు శ్రీజ తల్లిదండ్రులు ఆమెను పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత శ్రీజ దగ్గరి బంధువులు ఆమెను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి ఇంటికి వెళ్లి పలుమార్లు రెక్కీ నిర్వహించారు. వంశీకృష్ణ ఇంట్లో లేని విషయం తెలుసుకుని మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడ్డారు. కుటుంబ సభ్యులను కొట్టి మరీ బలవంతంగా శ్రీజను లాక్కెళ్లారు. గర్భిణీ అని చెప్పినా పట్టించుకోకుండా ద్విచక్రవాహనంపై ఆమెను తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న వంశీకృష్ణ.. పోలీసుల వద్దకు వెళ్లి తన భార్య శ్రీజను కిడ్నాప్ చేసినట్లు తెలిపాడు. ఎలాగైనా సరే భార్యను తన చెంతకు చేర్చాలని కోరాడు. 




"నా పేరు వంశీకృష్ణ. మాది ఎరుగట్ల. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న. మేము 9 ఇయర్స్ నుంచి లవ్ చేస్కున్నం. మే 31కు పెళ్లి చేస్కున్నం. వెంటనే పోలీసుల దగ్గరికి పోయినం. అక్కడ ఏం అనలేరు. ఇంటికచ్చినం. తర్వాత ప్రాణభయంతో హైదరాబాద్ కు పోయినం. అక్కడే ఉన్నం. అమ్మాయి తల్లిదండ్రులు రౌడీకి సుపారీ ఇచ్చిర్రు. వాళ్లు వచ్చి మమ్మల్ని ఊకే భయపట్టిచ్చిర్రు. గొడవ చేసిర్రు. భయంతో మళ్లీ ఊరొచ్చినం. నేను ఇంట్ల లేని టైం చూసి వచ్చి బలవంతంగా నా భార్యను కిడ్నాప్ చేసిర్రు. ఇంట్లో ఉన్న అందరినీ కొట్టి గొర్రెపిల్లను తీస్కపోయినట్టు తీస్కపోయిర్రు. ప్రెగ్నెంట్ అని కూడా సూడకుంట వాళ్లందరూ వచ్చి గొడవ చేసి తీస్కపోయిర్రు. ఇప్పటికన్నా పోలీసులు మాకు సాయం చేసి నా భార్యను నా దగ్గరకి తీస్కురావాలి". - వంశీకృష్ణ, శ్రీజ భర్త




"అమ్మాయిని కొట్టిర్రు. నిన్న అచ్చి ఇంట్లో పడుకున్న అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిర్రు. నేను బయటకెళ్లి. వచ్చే వరికి చేతిపైన కట్టెతోని కొట్టిర్రు. అమ్మాయిని బలవంతంగా తీస్కపోయిర్రు. ఎస్ఐకి కంప్లేంట్ చేసినం. కావాలనే ఎస్ఐ స్పందిస్తలే. లోకల్ నాయకుల అండదండలతో వాళ్లకే ఫేవర్ గ మాట్లాడుతున్నరు. మాకు సపోర్ట్ చేస్తలే. నాకు, మా ఫ్యామిలీకి ప్రాణహాని ఉన్నది. ఇప్పటికైనా పోలీసులకు మాకు సపోర్ట్ చేయాలి".  - వంశీకృష్ణ సోదరుడు


శ్రీజ తరఫు బంధువులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో తాను పెట్టిన కేసును పట్టించుకోవడం లేదని వంశీకృష్ణ వాపోతున్నాడు. ఇట్టి విషయం పై స్థానిక ఎస్సైను వివరణ కోరగా..  కిడ్నాప్ చేసిన వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.