Ramco Factory Accident : నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపింది.  ఈనెల 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా  సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. దాదాపుగా 30 మంది పైగా కూలీలు గాయపడ్డారని తెలుస్తోంది. మృతులు వెస్ట్ బెంగాల్ కు చెందినా సుమన్, రహీమ్ లగా పోలీసులు గుర్తించారు. బెల్ట్ వర్క్ జరుగుతుండగా వారంతా  ఒక్కసారిగా బెల్ట్ రూప్ తెగిపడంతో ముగ్గురు కార్మికులు పై నుంచి కిందికి పడిపోయి చనిపోయారు.  


సీఎం పర్యటనతో పనిఒత్తిడి 


ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో కూలీలకు పని భారం పెరిగి యాజమాన్యం నుంచి ఒత్తిళ్ల వల్ల ఇటువంటి ఘటన చోటు చేసుకుందని విమర్శలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ముగ్గురు కార్మికుల మృతికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే గాయపడిన కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. 


రూ. కోటి పరిహారం అందించాలి 


గతంలో విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన సంఘటనలో ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించిందని అదే తరహాలో రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో మరణించిన కార్మిక కుటుంబాలకు చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం భద్రతల కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారుల ద్వారా పర్యవేక్షణ నిర్వహించాలని కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదకర సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడవద్దని నాయకులు ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రతి కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


పోలీసుల మోహరింపు 


 నిర్మాణంలో ఉన్న  రాంకో సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాంలో ముగ్గురు ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఎత్తయిన ర్యాంపులు కూలిపోవడంతో వాటికిందపడి ముగ్గురు కార్మికులు  మరణించారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్  చేతుల మీదుగా రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఉంది. ఈ సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఈ ప్రమాదం జరిగిందని ఇతర కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు. ఈ ఘటనపై రాంకో పరిశ్రమ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేసింది.  ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తు్న్నారు. 


Also Read : Karnataka: ఉరేసుకున్న ట్రైనీ- ఆరుగురు IAF అధికారులపై మర్డర్ కేసు!


Also Read : Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్