ముంబయిలో ఓ మహిళ దారుణమైన రీతిలో అత్యాచారానికి గురై స్పృహతప్పిపోయిన స్థితిలో పడి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు 32 ఏళ్లు ఉండే ఓ మహిళపై కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా నిందితులు ఆమె ప్రైవేటు అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. రక్తపు మడుగులోనే ఆమెను వదిలేసి పారిపోయారు. ముంబయిలోని సాకి నాక ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


సాకి నాకలోని ఖైరానీ రోడ్డులో మహిళ స్పృహతప్పిపోయిన స్థితిలో రక్తపు మడుగులో పడిపోయి ఉంది. ఈ ఘటనను చూసిన స్థానికులు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్‌ రూంకు ఫోన్ చేసి విషయం తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడి చేరుకోగా ఆమె రక్తపుమడుగులో పడి ఉంది. వెంటనే విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుడి ఆచూకీ కనుక్కొని అతణ్ని అరెస్టు కూడా చేశారు. నిందితుణ్ని మోహన్ చౌహాన్ అనే 45 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. అతణ్ని పోలీసులు మరింతగా విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంత డీసీపీతో పాటు ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలిని మోహన్ చౌహాన్ అత్యాచారం చేశాక ఆమె ప్రైవేటు అవయవాలను కిరాతకుడు ఇనుప రాడ్‌తో ఛిద్రం చేశాడు. ఈ ఘటన అక్కడే రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఒక టెంపోలో జరిగిందని పోలీసులు చెప్పారు. రక్తపు మరకలు టెంపోలో కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 376 (అత్యాచారం), 323 (ఉద్దేశపూర్వక హాని), 504 సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లుగా ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో విచారణను మరింత లోతుగా చేస్తున్నారు.