Man Murder In Bapatla District: కుటుంబంలో నెలకొన్న స్థల వివాదంతో కొందరు సొంత బాబాయ్‌పైనే దాడికి పాల్పడగా అతను మృతి చెందాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా (Bapatla District) నగరం మండలం దాసరిపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషయ్య (48), ఆయన ఇద్దరు సోదరుల కుమారుల మధ్య ఇంటి స్థలం విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో పాటు ఇరు కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భూషయ్యకు, ఆయన సోదరుల కుమారులకు మాటా మాటా పెరిగి.. వారు కర్రలతో భూషయ్యపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన భూషయ్యను కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తమ్ముడిని చంపిన అన్న


అటు, కాకినాడ జిల్లాలో (Kakinada District) దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడినే దారుణంగా నరికేశాడు. తాళ్లరేవు మండలం పి.మల్లవరానికి చెందిన వ్యక్తి కుటుంబ వివాదాలతో తమ్ముడిని నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఆన్ లైన్ బెట్టింగ్‌కు కుటుంబం బలి


మరోవైపు, చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్‌కు బానిసై రూ.లక్షల కొద్దీ అప్పులు చేయగా.. కుటుంబం బలైంది. కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు యత్నించగా.. ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నాగరాజురెడ్డి (61) కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. ప్రస్తుతం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. అతని కుమారుడు దినేష్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. చిత్తూరులో తల్లీకొడుకులిద్దరూ అద్దె ఇంట్లో ఉంటుండగా.. తండ్రి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. నాగరాజురెడ్డి కుమార్తె సునీత రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తూ 3 నెలల కిందటే వచ్చింది.


కుమారుడు దినేష్ 'ఆన్ లైన్ బెట్టింగ్‌'లకు బానిసై రూ.20 లక్షల వరకూ అప్పు చేశాడు. అయినా, ఆపకుండా మళ్లీ రూ.లక్షల్లో అప్పులు చేశాడు. కాగా, నాగరాజు సోదరుల మధ్య ఇటీవలే ఆస్తి పంపకాలు జరగ్గా.. వీరికి రూ.20 లక్షలు వచ్చింది. ఈ క్రమంలో కొడుకు అప్పులు చేసిన విషయం తెలిసి నాగరాజురెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో కుటుంబ బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది. నలుగురూ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. కుమారుడు దినేష్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: AP Politics: క్రిస్టియన్ తో పెళ్లి, హిందూ మతం పేరుతో రాజకీయాలా?- పవన్ కళ్యాణ్‌పై గోరంట్ల మాధవ్ ఫైర్