Konaseema News: సోషల్‌ మీడియా వచ్చాక ఎవరు ఏ పని చేసినా అది ఏదో విధంగా బట్టబయలవుతోంది. కావాలని తమ వీడియోలు తామే పోస్టు చేసుకుంటుంటే... మరికొంతరు ఏదైన తప్పు జరిగినా, రోడ్డు ప్రమాదం జరిగిన, చివరకు చిన్న గొడవ జరగినా వీడియో తీసేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. కొన్నిసార్లు ఆ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. నిందితులను పట్టుకోవడానికి కూడా ఆ వీడియోలు సాయపడుతుంటాయి. అలాంటి ఘటనే ఇప్పుడు ఏపీలో జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో తక్షణమే పోలీసులు ఎంటర్‌ అయ్యి.. ప్రమాదకర స్థితిలో బైక్ పై నిలబడి బండి నడిపిన యువకుడి భరతం పట్టారు.


అసలేం జరిగిందంటే..?


డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఓ యువకుడు తన బైక్‌పై నిలబడి అత్యంత వేగంగా ప్రమాదకరంగా బైక్‌ నడిపాడు. అయితే ఆ బైక్ వెనకాలే వెళ్తున్న కారులోని యజమాని విషయాన్ని గుర్తించి వీడియో తీశాడు. ఆ యువకుడు ఎంత వేగంగా, ప్రమాదకరంగా బండి నడుపుతున్నది వివరించాడు. తాము కారులో వెళ్తున్నా అతడిని పట్టుకోలేకపోతున్నామని కూడా చెప్పాడు. అంత వేగంగా ఎవర్ని చంపేందుకు వెళ్తున్నాడో అర్థం కావడం లేదంటూ కామెంట్రీ ఇచ్చాడు. ఆనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. స్థానికంగా ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. ఎట్టకేలకు పోలీసుల దగ్గరకూ ఆ వీడియో చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. బండి నెంబర్ ఆధారంగా సదరు ఆకతాయిని అరెస్ట్ చేశారు. ప్రమాదకర స్థితిలో బైక్ నిలబడి అతి వేగంగా బండి నడిపిన యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ బండిని సీజ్ చేశారు. ఇలా ప్రమాదకరంగా వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


గతేడాది భీమవరంలోనూ ఇలాంటి ఘటనే


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ వాహనదారుడి దౌర్జన్యం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాహనదారుడు కానిస్టేబుల్‌పై పిడి గుద్దులు గుద్దాడు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురిని గాయపరిచి, ఆపకుండా వెళ్ళిపోతున్న కారును ఆపిన పోలీస్ కానిస్టేబుల్ పై దౌర్జన్యం చేసి గాయపరిచాడు. భీమవరంలోని (Bhimavaram) గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్, ర్యాష్ గా బండిని డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పని చేసుకుంటున్న వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్లాడు. తర్వాత బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్లాడు. 


అయినా, అతను కారు ఆపకుండా ముందుకు వెళ్తుండడంతో వీరమ్మ పార్క్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు స్థానికులు సమాచారం అందించారు. దీంతో కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ సతీష్ కుమార్ పై దౌర్జన్యం చేసాడు కారు డ్రైవర్ సంతోష్. ఏ ఊరు నుంచి వచ్చావు, నా కారు ఆపుతావా? అని బూతులు తిడుతూ కానిస్టేబుల్ పైన పిడి గుద్దులు కురిపించాడు. ఆ దాడిలో కానిస్టేబుల్ కు మెడ, చేతి భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి.