Konaseema News : కోనసీమలో మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్, లాకప్ డెత్ పుకార్లు నమ్మొద్దని డీఐజీ సూచన

ABP Desam Updated at: 30 May 2022 08:48 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Konaseema News : కోనసీమలో ఏదో జరిగిపోతుందని వస్తున్న పుకార్లు నమ్మొద్దని డీఐజీ పాలరాజు సూచించారు. అమలాపురం విధ్వంస ఘటనలో ఇప్పటి వరకూ 62 మందిని అరెస్టు చేశామన్నారు.

డీఐజీ పాలరాజు

NEXT PREV

Konaseema News : కోనసీమలో ఎలాంటి పుకార్లు నమ్మొద్దని డీఐజీ పాలరాజు కోరారు.  కోనసీమలో లాక్ అప్ డెత్ జరిగిందని ఆదివారం జోరుగా ప్రచారం జరిగింది. ఎలాంటి లాకప్ డెత్ జరగలేదని, ఇటువంటి పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన నడిపూడికి చెందిన కేత రమేష్ ను అరెస్ట్ చేశామన్నారు. ప్రజలు ఎవరూ తప్పుడు ప్రచారాలు నమ్మొవద్దని డీఐజీ పాలరాజు సూచించారు. అమలాపురంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. కేసులు దర్యాప్తులో భాగంగా మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.


62 మంది అరెస్ట్  



అమలాపురం విధ్వంసం కేసులో 62 మంది ఇప్పటి వరకూ అరెస్టు చేశాం. వీరిలో ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నవారు, నిందితుల వాగ్మూలం ద్వారా కొందరిని అరెస్టు చేశాం. ఏడు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది. ఎవరూ ప్లాన్ చేశారు. ఆ విషయాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఇవాళ స్పందన కార్యక్రమం కూడా ప్రశాంతంగా జరిగింది. రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. ఇతనికి ఇటీవల ఘటనకు సంబంధంపై ఆరా తీసుతున్నాం. ఎవరైన పుకార్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం అమలాపురం ప్రశాంతంగా ఉంది. అమలాపురంలో ఏదో జరిగిపోతుందని, లాకప్ డెత్ జరిగిపోయిందని, మళ్లీ దాడులు జరుగుతున్నాయని పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మొద్దు. ఇంటర్ నెట్ లేదు కాబట్టి ఫోన్ చేసి పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంటర్ నెట్ సేవలు మరో 48 గంటలు అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. - - పాలరాజు, డీఐజీ 


ఇంటర్నెట్ లేక అవస్థలు 


అమలాపురంలో విధ్వంసకర ఘటనలతో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇప్పటికి ఐదు రోజులైనా నెట్ సేవలు పునరుద్ధరించలేదు అధికారులు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్​నెట్ పనిచేయకపోవడంతో అన్ని రంగాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తిప్పలు వర్ణనాతీతం. సిగ్నల్స్ కోసం లాప్ టాప్స్, ఫోన్లు పట్టుకొని జిల్లా సరిహద్దులకు తరలివెళ్తున్నారు. యానాం, కాకినాడ, రాజమహేంద్రవరం, పాలకొల్లు, భీమవరం, నర్సాపురం ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తుకుంటున్నారు. గోదావరి ఒడ్డున కూర్చుని అతికష్టం మీద విధులు నిర్వహిస్తున్నారు కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మరోవైపు డిజిటల్ సేవలు నిలిచి ఆర్థిక లావాదేవీలు జరగడంలేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటర్నెట్ సేవలు పునరుర్ధరించాలని కోరుతున్నారు. లేకపోతే ధర్నాకు దిగుతామని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా హెచ్చరిస్తున్నారు. కోనసీమలోని 16  మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవు. 

Published at: 30 May 2022 08:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.