Hyderabad Crime : హైదరాబాద్ రాజేంద్రనగర్ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఇద్దరు బాలుర మధ్య చిచ్చురేపింది. బాలుడిని మరో బాలుడు కత్తితో పొడిచాడు. కత్తితో దాడి చేసి రక్తం కారుతుండగానే బాలుడు సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కత్తితో దాడి చేసిన అనంతరం బాలుడు పరారయ్యాడు. ఈ ఘటనపై రాజేంద్రనగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. అనంతరం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. 


ప్రేమ వ్యవహారంతో దాడి 


బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ముగ్గురు బాలురు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. వారిలో ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నారు. వారిద్దరూ మిత్రులతో కలిసి అత్తాపూర్‌లోని మూసీకాలువ వద్దకు వచ్చారు. అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో వాగ్వాదం జరిగింది. దీంతో ముందే ప్రణాళిక వేసుకున్న ఇద్దరు కలిసి మరో బాలుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. కత్తితో పొడవడంతో బాలుడు గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో అక్కడి నుంచి వాళ్లిద్దరూ పరారయ్యారు. బాలుడికి గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న లంగర్‌హౌస్‌ పోలీసులు బాలుడిని ఉస్మానియాకు తరలించారు. ఈ ఉదయం ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


అత్తపై కత్తితో దాడి


కాకినాడ పిఠాపురం విద్యుత్ నగర్ లో దారుణ హత్య జరిగింది. అత్తపై అల్లుడు సైతన రమేష్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త గండేపల్లి రమణమ్మ(46) అక్కడికక్కడే మృతి చెందింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రమణమ్మ భర్త సత్యన్నారాయణ, కొడుకు దిలీప్ కు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గత ఆరునెలలుగా భార్య దివ్యను కాపురానికి పంపలేదని అక్కసుతో ఉదయాన్నే ఇంటి బయట కాపు కాసిన రమేష్ కత్తితో అత్తపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అతడి భార్య దివ్య ఉద్యోగం నిమిత్తం గత రాత్రే హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. హత్య చేసి నేరుగా  పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడు రమేష్  లొంగిపోయాడు. 


Also Read : Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!


Also Read : Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, ఐసీయూలో చికిత్స