తొందర పడి నెరిపిన ప్రేమ వ్యవహారాలు చివరికి ఎంతటి వేదనకు గురి చేస్తాయో చాటే మరో ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రేమికులు శారీరక సంబంధం సైతం పెట్టుకున్నారు. తీరా యువతి పెళ్లి మాట ఎత్తే సరికి చేసుకోనని యువకుడు మొరాయించాడు. అంతేకాదు.. ఇకపై నిన్ను ఎవర్నీ పెళ్లి చేసుకోనివ్వనని కూడా వేధించడం మొదలు పెట్టాడు. ఇలా ఓ సైకో లవర్ టార్చర్ చేసిన ఘటన హైదరాబాద్‌లోని బోయిన్ పల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..


ఓ యువకుడు తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకోనని మోసం చేయడమే కాకుండా ఇప్పుడు అతను తనను బెదిరిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బోయిన్‌ పల్లి పోలీసులు వెల్లడించిన తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ పెద్దపల్లి మండలానికి చెందిన 24 ఏళ్ల యువతి మూడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ఉద్యోగానికి వెళ్తూ ఉంది. 


ఈ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌ జిల్లా శంకరం పేట మండలం గద్దెపక్క అనే గ్రామానికి చెందిన ఊకంటి రాజేంద్రప్రసాద్‌ అనే 26 ఏళ్ల వ్యక్తితో పరిచయం అయింది. అది క్రమంగా ప్రేమకు దారి తీసింది. అది మరింత గాఢంగా మారడం.. ఆ యువకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి శారీరకంగా కలవడం కూడా జరిగిపోయింది. ఈ క్రమంలోనే వారు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితుడు ఆమె ఫొటోలు, వీడియోలు కూడా తీశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తరచూ దాటవేస్తూ వస్తున్నాడని ఆరోపించింది. నిలదీయడంతో కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోనని, ఒకవేళ తాను వేరే వారిని పెళ్లి చేసుకుంటే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లుగా పోలీసులతో వాపోయింది. బాధితురాలి నుంచి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Also Read: Hyderabad: 7 నెలల పిల్లాడిపై శానిటైజర్ పోసి నిప్పు.. కన్న తల్లి నిర్వాకం, కారణం ఏంటంటే..


Also Read: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి