Drugs Seized Hyderabad: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో డ్రగ్స్ దందాలు చేసేవారి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్, ఇంటర్ స్టేట్ రెండు డ్రగ్ రాకెట్లను పట్టుకున్నట్లు వివరించారు. ఇంటర్నేషనల్ డ్రగ్ కేసులో ఒక నైజీరియన్ తో పాటు సాయి కృష్ణ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 30 గ్రాముల మెటాపెతమైన్ ను పట్టుకున్నట్లు వెల్లడించారు. నైజీరియన్ కి గతంలో నేర చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. 2017 లో పూణేలొ డ్రగ్స్ కేసులో ఏడాది పాటు జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. ఒకొరో అనే మరో నైజీరియన్ పరారీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. అలాగే నైజీరియన్ వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీమ్ నేరేడ్ మెట్ పోలీసులు కలిసి ఈ డ్రగ్ రాకెట్ పై దాడి చేశారు. 






గడిచిన కొద్ది రోజుల నుంచి మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ డ్రగ్ పెడలెర్స్ ను పట్టుకుంటున్నామని, వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాదీనం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. మరో కేసులో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 45 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 35 లక్షల రూపాయలు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్. రాజస్థాన్ కి చెందిన నిందితులు ఇక్కడ నిర్మాణ పనుల్లో పని చేస్తున్నారు. మెల్లిగా డ్రగ్స్ సప్లై చేస్తూ అడ్డ దారిలో బాగా డబ్బులు సంపాదిస్తూన్నారు. 






ఇంటర్నేషనల్ మార్కెట్ లో హెరాయిన్ విలువ కిలో 5 కోట్ల పైనే ఉంటుందని మహేష్ భగవత్ తెలిపారు. డబ్బుకు ఆశపడి మన దేశంలోనూ చాలా మంది ఈ దందాకి పాల్పడుతునట్టు అధికారులు గుర్తించారు. చట్టాన్ని లెక్కచేయకుండా విచ్చల విడిగా ఈ డ్రగ్స్ ని సప్లై చేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ కేలుల్లో దొరికితే నిందితులకు 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి యువత ఇలాంటి దందాలకు పాల్పడి జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. తెలిపారు. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిగేలా చూస్తామని వివరించారు. 


డ్రగ్స్ మాఫియా విస్తరణ - కాలేజీలు, పాఠశాలలే అడ్డాలుగా..!


యువతను బానిసలుగా చేస్తూ వారి ద్వారా డ్రగ్స్ మాఫియా విస్తరింపచేస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ముఖ్యంగా బడులు, కళాశాలల్లో కూడా డ్రగ్స్ ఎంత ప్రమాదకరం అనే దానిపై కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 శాతం యువతే ఉండడంతో ఇక్కడ డ్రగ్స్ మాఫియాను విస్తరించేందుకు అక్రమార్కులు అనేక ఎత్తులు వేస్తున్నారని తెలిపారు. కాబట్టి యువత తప్పుడు తోవలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉందని.. వారు ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారో కన్నేసి ఉంచాలని సూచించారు.