Hyderabad Crime : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాజీ  ప్రియురాలు ఇంటికి వెళ్లిన యువకుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్  లో కేసు నమోదు అయింది. నిందితుడు లలిత్ సెహగల్ స్థానికంగా ఉన్న పబ్ లలో గిటారిస్ట్ గా పనిచేస్తున్నాడు. నిందితుడిపై  IPC 376రెడ్ విత్ 511, 354,323, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. లలిత్ ను అరెస్టు చేశారు. 


పబ్ లో గిటారిస్ట్ 


జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో గిటారిస్ట్ గా పనిచేస్తున్న లలిత్ సెహగల్ ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే గతంలో వీరిద్దరికి పరిచయం ఉందని తెలుస్తోంది. సెహగల్ తో ఆ యువతి స్నేహం చేసినట్లు సమాచారం. యువతి ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెహగల్ ను అరెస్టు చేశారు. లలిత్ సెహగల్ మద్యం మత్తులో అత్యాచారయత్నం చేశాడా? లేక ఆ యువతిపై కన్నేసి కావాలనే ఈ దారుణానికి పాల్పడ్డాడా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


చందానగర్ లో దారుణ ఘటన 


హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు దంపతుల మధ్య గొడవల కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్న భర్త.. ఆమె పని చేసే చోటుకి వెళ్లి మరీ కత్తితో దాడి చేశాడు. అంతా చూస్తుండగా ముఖ్యంగా కన్నకూతురి ఎదుటే.. పట్టపగలు దారుణంగా నరికి చంపాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్ లోని చందానగర్ లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల అంబికకు గతంలోనే సురేందర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. కానీ గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. దీంతో భార్య అంబిక.. భర్తకు దూరంగా వచ్చేసింది. వేరే ఇంట్లో ఉంటూ కూతురితో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే బతుకు దెరువు కోసం నల్లగండ్ల బాటా షోరూం పైన ఉన్న శ్వాస బోటిక్ లో పని చేస్తోంది. అయితే భార్య అంబికపై విపరీతమైన కోపం పెంచుకున్న సురేందర్ ఆమెను ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. ఈరోజు కత్తి తీసుకొని ఆమె పని చేస్తున్న చోటుకు వచ్చాడు. అంతా చూస్తుండగా.. పట్టపగలే కత్తితో ఆమె పీక కోశాడు. తీవ్ర గాయాలపాలైన అంబిక అక్కడికక్కడే మరణించింది. అదే సమయంలో వారి కూతురు కూడా అక్కడే ఉంది. కళ్లెదుటే తండ్రి.. తన అమ్మను చంపడం చూసిన చిన్నారి భయంతో గజగజా వణికిపోతోంది.  అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాపను కూడా పోలీసులు వారి వెంటే తీసుకెళ్లారు. అంబిక బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య అంబిక మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతోనే భర్త సురేందర్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. అలాగే నిందితుడు సురేందర్ కోసం గాలిస్తున్నామని చందానగర్ పోలీసులు వివరించారు.