హైదరాబాద్‌లో ఓ ఇంటర్ విద్యార్థి అయిన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రెండు వేర్వేరు సూసైడ్ నోట్‌లు రాసి మరీ అతను ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఉండి చదువుకుంటున్న వ్యక్తి తీవ్ర ఒత్తిడి లోను కావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 


హైదరాబాద్‌‌లోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా చారగొండ గ్రామంలో లింగారం లక్ష్మయ్య - సువర్ణ దంపతులు ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు వంశీ కృష్ణ. ఇతనికి 17 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇర్మీడియట్ బైపీసీ విభాగంలో ఫస్టియర్ చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా 10 గంటల వరకు స్టడీ అవర్స్‌లో పాల్గొన్నాడు. హాస్టల్‌లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకుని రాత్రి 10 గంటల తర్వాత నిద్రపోయాడు. 


ఉదయాన్నే లేచిన తోటి విద్యార్థులకు గదిలో వంశీ కనిపించలేదు. అతని కోసం వెతగ్గా.. శనివారం ఉదయం తరగతి దగిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో భయపడిపోయిన విద్యార్థులు వెంటనే పరిగెత్తి ప్రిన్సిపల్‌‌కు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. 


ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరిపే క్రమంలో అతని పుస్తకాల బ్యాగును పోలీసులు పరిశీలించారు. ఆ బ్యాగులో పుస్తకాల మధ్య పోలీసులకు రెండు సూసైడ్ నోట్‌లు లభించాయి. ఒకటి తెలుగులో రాసి ఉండగా.. అందులో తాను లైంగికంగా వేధింపులకు గురైనట్లు రాశాడు. అందుకే ఆ వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇంకో సూసైడ్ నోట్ ఇంగ్లీషులో రాసి ఉంది. ఆ లేఖలో తాను బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా అని రాసి ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమారుడి మరణంపై సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు.


Also Read: Telangana Governor: మేడారంలో గవర్నర్‌కు అవమానం జరిగిందా! వాళ్లంతా అలా ఎందుకు చేశారు? విరుచుకుపడుతున్న బీజేపీ


Also Read: Vikarabad: ఇతను కాస్త మంచి దొంగ! ఆ దొంగతనానికి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు, ఎందుకంటే