Hyderabad: హైదరాబాద్ లోని ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోరబండలోని బంజారా నగర్ లో ఉంటున్న లక్ష్మీ అనే యువతిపై.. సురేష్ అనే యువకుడు హత్యాయత్నం చేయబోయాడు. అమ్మాయి తనను ప్రేమించట్లేదనే కోపంతో గొంతు కోసి చంపే ప్రయత్నం చేయబోయాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. ఈ క్రమంలోనే యువతి గొంతుకు గాయం అయింది. అయితే గాయపడిన యువతిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 


గతేడాది ఓయూలో దారుణ ఘటన - యువతిపై ప్రేమోన్మాది దాడి


హైదరాబాద్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషీరాబాద్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. యువతిపై దాడికి పాల్పడిన నిందితుడు రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


హైదరాబాద్ లో కత్తి దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల పరువు హత్యలు జరగగా, తాజాగా ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ప్రేమకత్తి పంజా విసిరింది. ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. శనివారం సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై గొడప జరిగింది. ఈ గొడవతో రంజిత్ ఆగ్రహానికి గురై తనతో తెచ్చుకున్న ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప హాస్టల్లో ఉన్న విద్యార్థులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన యువతిని కాచిగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు రంజిత్ కోసం గాలిస్తున్నారు.  ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆమె కుడి చేతికి గాయం కావడంతో చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.  


అదేరోజు పాతబస్తీ సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీ


హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో దారి దోపిడీ జరిగింది. బైక్ పై వెళుతున్న వైన్స్ షాప్ క్యాషియర్ నుంచి రూ.6 లక్షల నగదు బ్యాగ్ ను  గుర్తు తెలియని యువకులు దోచుకుపోయారు. సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ లక్ష్మి వైన్స్ ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మూసివేసిన క్యాషియర్ నవీన్  కలెక్షన్ డబ్బుల బ్యాగ్ తో తోటి సిబ్బందితో బైక్ పై ఇంటికి బయలు దేరారు. వైన్స్ షాపునకు సుమారు 50 అడుగుల దూరంలో వెనుకగా హోండా యక్టీవాపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా క్యాషియర్ చేతిలో బ్యాగ్ ను లాక్కొని పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన వైన్ షాపు సిబ్బంది బైకుపై వెంబడించగా కొంత దూరం వెళ్లాక దుండగులు హోండా యాక్టివాను వదిలి నాలలో దూకి పారిపోయారు. ఈ ఘటనపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫ్యూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.