Hyderabad Crime News: ముందుగా ఓ అబ్బాయిని ప్రేమించింది. అతడితోనే జీవితం అనుకొని పెళ్లి చేసుకుంది. ఏడాది పాటు హాయిగా గడిపారు. ఈక్రమంలోనే వీరికో పాప పుట్టింది. పాప పుట్టాక ఏడాది పాటు బాగానే ఉన్న ఈ దంపతులు ఆ తర్వాత గొడవలు పడడం ప్రారంభించారు. ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారు. యువతి పాపను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక్కడే తమ బంధువుల అబ్బాయితో స్నేహం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తతో విడాకులు ఇవ్వగానే పాపను చంపి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ విడాకులు రాకముందే యువతి పాప మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆపై నిద్రలో చనిపోయిందంటూ డ్రామా చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆమె నిందితురాలని తేలింది.


మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడలో ఉంటున్న కల్యాణి, అదే ప్రాంతానికి చెందిన రమేష్ ను ప్రేమించింది. ఇద్దరూ తమ ప్రేమను రెండు కుటుంబాల్లో ఒప్పించి మరీ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది అంటే 2019లో వీరికి ఓ పాపు పుట్టింది. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతూ బాలికకు తన్విత అని పేరు పెట్టుకున్నారు. అయితే గతకొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. కల్యాణి పాప తన్వితను తనతో పాటే తీసుకెళ్లి కాప్రాలోని తన పుట్టింట్లో ఉంటోంది. అయితే జనగాం జిల్లా బచ్చనపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన 19ఏళ్ల నవీన్ తో కల్యాణికి పరిచయం ఏర్పడింది. అతడు వీళ్లకు బంధువు కావడంతో అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేవాడు. ఈక్రమంలోనే వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 


జులై 1న బాలిక హత్య


ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పాప ఉంటే తనను పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోరంటూ నవీన్ చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి పాపను చంపేయాలనుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. అయితే జులై 1వ తేదీన బాలిక బడికి వెళ్లి మధ్యాహ్నం వచ్చింది. పాపను పడుకోబెడుతున్నట్లు నటించిన కల్యాణి దిండు పాపపై పెట్టి ఊపిరాడకుండా చేసింది. ఈక్రమంలోనే బాలిక కాసేపటికే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లుగా పాపను అక్కడే ఉంచి ఇంట్లో పనులు అన్నీ చేసుకుంది. సాయంత్రం అవుతున్నా పాప లేవట్లేదంటూ వెళ్లి లేపినట్లుగా నటించింది. బాలిక చడీచప్పుడు లేకుండా ఉండడంతో తల్లికి చెప్పింది. వెంటనే ఇద్దరూ కలిసి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయినట్లు తెలిపారు. 


అయితే కూతురు చనిపోయిందంటూ కల్యాణి తన భర్త రమేష్ కు ఫోన్ చేసి చెప్పింది. అతడికి ముందు నుంచి కల్యాణిపై నమ్మకం లేకపోవడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే ఆస్పత్రికి వెళ్లి బాలిక ఎలా చనిపోయిందని కల్యాణితోపాటు వాళ్ల అమ్మను ప్రశ్నించారు. ముందుగా నిద్రలో చనిపోయిందంటూ నాటకం ఆడిన కల్యాణి... గట్టిగా నిలదీసే సరికి అసలు విషయం చెప్పింది. తాను, ప్రియుడి కలిసే పాపను చంపాలనుకున్నట్లు వెల్లడించింది. ఈక్రమంలోనే దిండు మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వెల్లడించింది. కల్యాణితో పాటు ఆమె ప్రియుడు నవీన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.