Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ రెస్టారెంట్ జనరల్ మేనేజర్‌పై కాల్పులకు తెగబడ్డారు. మదీనా గూడలోని సందర్శిని ఎలైట్‌ రెస్టారెంట్‌లో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న 35 ఏళ్ల దేవేందర్‌ గాయన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. దేశవాళీ తుపాకీతో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరపగా.. దేవేందర్ గాయన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే దేవేందర్ గాయన్ మృతి చెందాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


దేవేందర్‌ కోల్‌కతాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే దేవందర్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు దాడి చేశారు, కారణాలు ఏంటనే విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. సంఘటనా స్థలాన్ని మాదాపూర్‌ జోన్‌ డీసీప్‌ సందీప్‌రావు, మియాపూర్‌ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు.  అయితే కా కాల్పులకు కారణం పాత కక్షలే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.


Read Also: Actor Manoj Remand: శామీర్‌పేట్‌ కాల్పుల ఘటనలో నటుడు మనోజ్‌కు రిమాండ్‌, చర్లపల్లి జైలుకు తరలింపు


నాలుగు నెలల క్రితం కరీనంగర్ లో కాల్పులు


కరీంనగర్‌ జిల్లాలో ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి కాల్పుల కలకలం సృష్టించాయి. నలుగురు రౌడీలు మరో రౌడీషీటర్‌పై గన్ తో కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాషబోయిన అరుణ్‌ అనే రౌడీషీటర్‌పై మరో ఇద్దరు వ్యక్తులు... అరుణ్ ఇంట్లోనే దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. తపంచాతో కాల్పులకు దిగారు. అయితే గురి తప్పడంతో అరుణ్‌ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి పారిపోయాడు. అరుణ్ ఎక్కడికి పారిపోయాడో చెప్పాలని కుటుంబ సభ్యులపై దాడికి దిగారు దుండగులు. అరుణ్ ఇంటిని ధ్వంసం చేశారు. అరుణ్‌ ఎక్కడున్నాడో చెప్పాలని కుటుంబ సభ్యులను గన్ తో బెదిరించి దాడి చేశారు. స్థానికులు స్పందించి  అరుణ్‌ కుటుంబ సభ్యులను కాపాడారు. ఇద్దరు రౌడీలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల్లో ఒకరు యాదాద్రి జిల్లాకు చెందిన పాల మల్లేష, మానుకొండూరుకు చెందిన బైరగోని మధు అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


గన్ తో బెదిరించి ఖతం చేస్తామన్నారు- స్థానికులు


"గొడవ జరిగినప్పుడు మేం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చాం. ఎవరైనా దగ్గర వస్తే ఖతం చేస్తామని గన్ పెట్టి బెదిరించారు. ఎవరూ దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. రౌడీల్లా ఉన్నారు. మొత్తం నలుగురు వచ్చారు. మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు అరుణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అరుణ్ వాళ్ల నుంచి తప్పించుకుని పక్కింట్లో తలదాచుకుంటే వాళ్లపై కూడా దాడి చేశారు. దాడి చేసిన వాళ్లను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాం"- స్థానికులు