Shamirpet Gun Fire Actor Manoj: 
హైదరాబాద్: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ లో సెలబ్రిటీ కాల్పుల కేసులో నటుడు మనోజ్‌ను పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. నేటి ఉదయం నటుడు మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అల్వాల్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. అల్వాల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కాల్పులు జరిపిన నిందితుడు మనోజ్ ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.  


శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో శనివారం కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ దాస్‌ అనే వ్యక్తి భార్య వద్దకు రాగా, ఆమెతో సహజీవనం చేస్తున్న నటుడు మనోజ్ తో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనోజ్‌కుమార్‌ ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిపాడు. అలర్ట్ అయిన సిద్ధార్థ్ అక్కడి నుంచి తప్పించుకుని శామీర్ పేట్ పోలీసులను ఆశ్రయించాడు. నటుడు మనోజ్ తనపై కాల్పులు జరిపాడని ఫిర్యాదు చేయగా, ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద మనోజ్‌పై కేసు నమోదు చేశారు. నేడు నిందితుడు మనోజ్ ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.


ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 49 ఏళ్ల సిద్దార్థ దాస్ కు ఒఢిశాలోని బరంపూర్ కు చెందిన 43 ఏళ్ల స్మితాదాస్ తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 17 ఏళ్ల వయసున్న కుమారుడు, 13 ఏళ్లున కుమార్తె ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. స్మిత విడాకులు కావాలంటూ 2019లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిల్లలతో పాటు తాను వేరే చోట ఉంటానని... అక్కడకు తన భర్తని రానీయకుండా చూడాలంటూ కోర్టును కోరింది. ఆదేశాలను కూడా తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఇద్దరు పిల్లల్ని తన వందే ఉంచుకొని చూసుకుంటుంది స్మిత. ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి స్మితాదాస్ కౌన్సిలింగ్ ఇచ్చేది.


18వ తేదీన విచారణకు రావాలని స్మితకు నోటీసులు 
శంభో శివ శంభో, వినాయకుడు చిత్రాల్లో నటించిన 39 ఏళ్ల మనోజ్ కౌన్సిలింగ్ తీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతడు.. ఒత్తిడి భరించలేక స్మితా వద్ద కౌన్సిలింగ్ కు వచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. అయితే గత మూడేళ్లుగా వీరిద్దరూ శామీర్ పేటలోని సెలబ్రిటీ విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవలే వీరిద్దరూ కలిసి విజయవాడలో ఓ కార్యాలయం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మనోజ్... తననూ, తన చెల్లిని ప్రతిరోజూ కొడుతున్నాడని, తీవ్రంగా వేధిస్తున్నాడని స్మితా దాస్ కుమారుడు జూన్ 12వ తేదీన బాలల సమరక్షణ కమిటీని ఆశ్రయించాడు. తల్లి వద్ద కానీ, వారి బంధువుల వద్ద కానీ ఉండనంటూ చెప్పాడు. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు బాలుడిని సంరక్షణ గృహానికి తరలించారు. అయితే ఈనెల 18వ తేదీన బాలికతో కలిసి స్మితా విచారణకు రావాలని సీడబ్ల్యూసీ అధికారులు స్మితకు నోటీసులు పంపించారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial