Mla Balakrishna PA :  కర్ణాటక(Karnataka)లోని పేకాట దాడుల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  పీఏ బాలాజీ, పలువురు వైసీపీ నేతలు(Ysrcp Leaders)పట్టుబడ్డారు.  ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట స్థావరంపై కర్ణాటక పోలీసులు(Police) దాడులు చేశారు. హిందూపురానికి(Hindupur) చెందిన 19 మంది పేకాట రాయుళ్లను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.  పట్టుబడ్డ వారిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీతో హిందూపూర్ మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీ రామ్ రెడ్డి కూడా ఉన్నారు. నిందితులను కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 



పీఏలతో బాలయ్యకు చిక్కులు 


హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో తలనొప్పి వచ్చి పడింది. బాలయ్య పీఏ బాలాజీ సరిహద్దులోని చిక్బళ్ళాపూర్ జిల్లా నగరిగెర సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ లో పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడ్డారు. అయితే ఈయన ప్రత్యర్థి పార్టీలోని వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన కీలకనేతలతో కలిసి పేకాట ఆడుతూ పట్టుబడటంతో ఇప్పుడు ఈ విషయం హిందూపురంలో హీట్ పుట్టిస్తోంది. ఓ వైపు అధికార పార్టీ నేతలతో టీడీపీ కేడర్ ఇబ్బందులు పడుతుంటే బాలయ్య పీఏ మాత్రం అధికార పార్టీ నేతలతో కలిసి పేకాట ఆడటం, పోలీసులకు పట్టుబడటంతో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడన్న సస్సెన్స్ నెలకొంది. బాలయ్య ఎంఎల్ఏ అయినప్పటి నుంచి బాలాజీ పీఏగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా బాలయ్యకు అధికారిక పీఏగా బాలాజీ వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా కూడా బాలయ్య పీఏగా బాలాజీ పనిచేస్తున్నారు. బాలయ్య ప్రోగ్రామ్స్ తో పాటు హిందూపురంలో ఆయన వ్యవహారాలన్ని ఆయనే చూస్తున్నారు.


ప్రైవేట్ పీఏతోనూ సమస్యలు  


అంతటి కీలకమైన వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి...కానీ వాటికి భిన్నంగా పీఏ బాలాజీ వైఖరి ప్రస్తుతం బాలయ్యకు తలనొప్పిగా మారింది. గతంలో కూడా బాలయ్యకు ప్రైవేట్ పీఏగా ఉన్న శేఖర్ వ్యవహార శైలి వల్ల అనేక సమస్యలు వచ్చాయి. అప్పట్లో ప్రైవేట్ పీఏపై అనేక ఆరోపణలు రావడం, కేడర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పట్లో ఆయన్ను హిందూపురం నుంచి పంపేశారు. మళ్లీ ఇప్పుడు పీఏ బాలాజీ వ్యవహారంపై కూడా అనేక ఆరోపణలు వున్నాయి. వాటన్నిటిని సర్దిచెప్పి పనిచేయిస్తున్నప్పటికీ పేకాటలో పట్టుబడటం అది ప్రత్యర్థి పార్టీలోని కీలకనేతలతో కలిసిపోయి దొరికిపోవడంతో ఈ వ్యవహారం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. మరి ఈ వ్యవహారంపై బాలయ్య ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీని తప్పిస్తారా లేకపోతే ఏం చేస్తారన్న ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బాలకృష్ణ  ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలిపెడతారా అన్న సందేహాలు హిందూపురం టీడీపీ కేడర్లో నెలకొంది.


Also Read : Chittoor Kidnap Case: రూ. 50 వేలకు బేరం- కట్టెల బ్యాగులో కిడ్నాప్, చిత్తూరు బాలుడి కిడ్నాప్‌ కేసు నిందితులు ఎలా చిక్కారంటే?


Also Read : Jeelugumilli SI: జీలుగుమిల్లి ఎస్సైపై లైంగిక ఆరోపనలు, సస్పెండ్ - మహిళ సెల్ఫీ వీడియో వైరల్