Crime Incidents Happened In Hyderabad: హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో ఒకే రోజు వరుస హత్యలు కలకలం రేపాయి. నగర పరిధిలోనే 24 గంటల వ్యవధిలోనే 5 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయి. పాతబస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యారు. ఇక ఈ పరిధిలోనే వజీద్, ఫక్రుద్దీన్ అనే వ్యక్తులపై దుండగులు హత్యాయత్నం చేశారు. అటు, సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధి అడ్డగుట్టలో రోజా అనే మహిళను ఆమె భర్త దారుణంగా హతమార్చాడు. అలాగే, ఆసిఫ్ నగర్‌లో అలీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అటు, కాచిగూడ పోలీస్ స్టేషన్ (Kachiguda Police Station) పరిధిలో ఖిజార్ అనే వ్యక్తిని దుండగులు నరికి చంపేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో గురువారం ఉదయం అజార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఒకేరోజు ఇన్ని హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.


Also Read: Alpha Hotel: పాడైపోయిన మటన్‌తో బిర్యానీ - సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌పై కేసు, జరిమానా