Cyber Crime: పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొదట వాట్సాప్, ఫేస్ బుక్, టెక్స్ట్ మెసేజెస్ చేస్తూ.. అమాయకులు ఆకర్షితులయ్యేలా చేస్తారు. పార్ట్ టైం జాబ్స్ పేరిట ఇంట్లో కూర్చుని రోజుకి 10,000 నుంచి 25,000 వేల వరకూ సంపాదించడంటూ మెస్సేజెస్ చేస్తారు. ఒక్కసారి మనం ఆ లింక్ ను క్లిక్ చేసినా, అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినా ఇక మన పని అయిపపోనట్టే. అలా రోజుకి హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు దాదాపు 20 నుంచి 30 వరకు కేసులు వస్తున్నాయంటే మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయలు దాటితేనే ఫిర్యాదు చేసేందుకు బాధితులు సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. లక్షకు తక్కువ జరిగిన ఫిర్యాదులు స్థానిక పోలీస్ స్టేషన్ లోనే నమోదవుతాయి. దీని బట్టి రోజుకి కనీసం వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్న మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న వారు పరువు కోసమో లేదా కొంత డబ్బే కదా అని ఫిర్యాదు కూడా చేయడం లేదు. 


300తో మొదలై వేలుకు వెళ్తుంది...


అయితే మొదట జాబ్ పేరుతో లేదా ఏదైనా కంపెనీ బ్రాండ్ ను ఉపయోగిస్తూ రిజిస్ట్రేషన్ పేరుతో 300 కట్టమని కోరతారు. అలా మొదలైన వ్యవహారం ఇంకో 3000 పంపమని మళ్లీ అడుగుతారు. ఆ తరవాత ఖాత మొత్తం ఖాళీ అయ్యేదాక నమ్మిస్తూ ఉంటారు. డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఈ మోసం బయట పడుతుంది. అయితే గృహిణులు ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదైనా పని చేసుకుందామనుకొని ఆన్ లైన్ లో ఆకర్షణీయంగా కనిపించిన లింక్ లను క్లిక్ చేస్తూ.. మోసగాళ్ల మాయలో పడుతున్నట్లు వివరిస్తున్నారు. 


ముక్కూ, మొహం తెలియని వాళ్లకు అస్సలే డబ్బు పంపించొద్దు..


లాకే డౌన్ తరవాత ఇటువంటి మోసాల సంఖ్య అధికమైంది. ఎప్పుడైనా, ఎవరైనా సరే ఉద్యోగం పేరుతో డబ్బు అడిగితే అది కచ్చితంగా మోసపురితం అని గ్రహించాలి. అదే విదంగా ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఒకసారి డబ్బు కట్టాక.. మళ్లీ మళ్లీ పెద్ద మోతాదులో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయమని అడిగితే మీరు మోసపోతున్నట్లు గుర్తించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులను, హౌస్ ఫైవ్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముక్కూ, మొహం తెలియని వాళ్లకు డబ్బులు పంపించకూడదని పేర్కొంటున్నారు. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. అప్పుడే ఇలాంటి మోసాలను అడ్డుకోగలం అని తెలిపారు. ముఖ్యంగా యువత ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి మోసాలకు గురవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 


Hyderabad: డేటింగ్ యాప్స్ పేరుతో వ్యాపారికి కోటి 50 లక్షల టోకరా, నిందితుడు అరెస్ట్!