Couple Forceful Death After Killed Children In Jeedimetla: తమ పిల్లలను చంపిన దంపతులు అనంతరం బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ జీడిమెట్ల (Jeedimetla) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్ (40), వర్షిణి (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలు రిషికాంత్ (11), విహంత్ (3)తో కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి తమ ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు అనంతరం వారూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి స్వస్థలం మంచిర్యాలగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు ఇలా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.


ఉరి వేసుకునే ముందు వెంకటేశ్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ వ్యసనానికి బానిసై తన భార్య, పిల్లలిద్దరికీ విషం ఇచ్చి అనంతరం తాను ఉరి వేసుకుని చనిపోయినట్లు సమాచారం. మృతుని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. 


మరో విషాదం


మరోవైపు, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర విషాదం నెలకొంది. కొత్తపల్లి మండలంలోని ఎక్కమేడ్ గ్రామంలో అర్ధరాత్రి ఇల్లు కూలి ఇంట్లో నిద్రిస్తోన్న తల్లీకుమార్తె మృతి చెందారు. మృతులు హన్మమ్మ (40), ఆమె కుమార్తె అంజిలమ్మ (35) గా గుర్తించారు. కూతురు భర్త చనిపోగా ఆమె తల్లి వద్దే ఉంటోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.


Also Read: Warangal Rains: వరంగల్‌లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, వరదకు కొట్టుకుపోయిన ఆటోలు, వస్తువులు