Chittoor Road Accident :  చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కాణిపాకం పట్నం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్ ను వెనుక నుంచి  కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు‌నుజ్జు అయింది.  కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతులు బెంగుళూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.  పాల ట్యాంకర్ వెనుక భాగంలో చిక్కుకున్న కారును వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి  కారణమని పోలీసులు భావిస్తున్నారు. 


అసలేం జరిగింది? 


చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలోని తవణంపల్లి మండలం కాణిపాక పట్నం వద్ద వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న పాల ట్యాంకర్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పాల ట్యాంకర్ ను వెనుక వైపు నుంచి కారు అతి వేగంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు రిజిస్ట్రేషన్ గల పాల టాంకర్ ముందుగా వెళుతుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్ చెందిన కారు (నంబర్ KA 53 MH 1858 ) వెనుక వైపున ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన అద్దంకి అశోక్ బాబు అతని భార్య కుమారుడు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. వర్షం కురుస్తుండడం అతివేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడంతో మృతుల వివరాలు పూర్తిస్థాయిలో తెలియ రాయడం లేదు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఆర్డీవో రేణుక, డిఎస్పి శ్రీనివాస్ మూర్తి , సీఐ శ్రీనివాసులు రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను అతి కష్టం మీద వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తవణంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


విజయనగరంలో రోడ్డు ప్రమాదం 


విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కెఎల్‌.పురం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో గురువారం ఆటోను ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలానికి చెందిన మజ్జి సూర్యనారాయణ, దొంతల జమ్మన్న, గెద్ద రమణ, చిల్ల శ్రీను, అలమండ రమణ, సాసుబిల్లి అప్పారావు, కోరాడ అచ్చిరాజు, మీసాల నారాయణరావు, బొబ్బిలికి చెందిన చైతన్యతో  అంబటివలసకి చెందిన పీతల రాంబాబులు కలాసీ పనులకు ఆటోలో బయలుదేరారు. ద్వారపూడి రైల్వే బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి జైపూర్‌ నుంచి విశాఖ వైపు వస్తున్న ఓ  ప్రైవేటు అంబులెన్స్‌ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు వెళ్తోన్న ట్రాక్టర్‌ను ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అదే అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వారిలో సాసుబిల్లి అప్పారావు, కోరాడ అచ్చిరాజు, మీసాల నారాయణరావుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విజయ్‌  తెలిపారు.


Also Read : Siddhaanth Surryavanshi Death: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ హిందీ నటుడి మృతి!