Bihar Crime News: వారిద్దరికీ 2012లో పెళ్లి జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇప్పటికే నలుగురు పిల్లలు పుట్టారు. మరోసారి ఆమె గర్భం దాల్చగా.. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ. అయితే పెళ్లి అప్పుడు ఆమె పుట్టింటి వాళ్లు రిఫ్రిజిరేటర్ ఇస్తామని చెప్పారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక కొనివ్వ లేకపోయారు. దీంతో కోపం పెంచుకున్న అత్తింటి వాళ్లు.. తరచుగా మహిళను వేధించే వాళ్లు. పుట్టింటికి వెళ్లి రిఫ్రిజిరేటర్ తీసుకురమ్మని హింసించేవాళ్లు. అయినా ఆమె అవేం పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయింది. దీంతో కోపం పెంచుకున్న భర్త, అత్త, మామలు.. నిండు చూలాలు అని కూడా చూడకుండా విపరీతంగా కొట్టారు. ఈక్రమంలోనే సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. 


అసలేం జరిగిందంటే..?


బిహార్ లోని పుర్నియా జిల్లా భేలా ప్రసాది భవానీపూర్ చెందిన గ్రామానికి 30 ఏళ్ల అంగూరి బేగం, మోమినాత్ అలాంకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అంగూరి బేగం ఐదోసారి గర్బం దాల్చగా.. ప్రస్తుతం ఏడు నెలలు. పెళ్లి సమయంలో అంగూరి బేగం తల్లిదండ్రులు కట్నంగా రిఫ్రిజిరేటర్ ఇస్తామని చెప్పారు. కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగా లేక ఏమీ ఇవ్వలేకపోయారు. అయితే తరచుగా అత్తింటి వాళ్లు ఫ్రిజ్జు కోసం దెప్పిపొడుస్తూనే ఉన్నారు. అయినా అంగూరి బేగం అవేమీ పట్టించుకోకుండా కాపురం చేస్తూ వస్తోంది. అయితే తాజాగా భర్త, అత్త, మామ మరోసారి ఫ్రిజ్ తీసుకు రమ్మని కోరారు. అందుకు ఆమెకు స్పందించకపోయే సరికి హిసించడం మొదలు పెట్టారు. తీవ్రంగా కొట్టడంతో అంగూరి బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 


పుట్టింటి వాళ్లకు సమాచారం ఇచ్చి పారిపోయిన భర్త, అత్త, మామలు..


అయితే అంగూరి బేగం చనిపోయిందని భర్త, అత్త, మామలు ఆమె పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అంగూరి తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే అంగూరి భర్త, అత్త, మామలు అక్కడి నుంచి పారిపోయారు. కేవలం కూతురి మృతదేహం, ఆమె పిల్లలు మాత్రమే అక్కడ ఉన్నారు. దీంతో అంగూరు తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా అంగూరి బేగం మృతదేహాన్ని పుర్నియా సర్దార్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమెను విపరీతంగా కొట్టడం వల్ల చనిపోయిందని నిర్ధారించారు. అలాగే ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భిణీ అని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అంగూరి బేగం తల్లిదండ్రులకు అప్పగించారు.


"ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కొట్టి చంపేశారు"


"మా సోదరిని ఓ రిఫ్రిజిరేటర్ కోసం వాళ్ల అత్తింటి వాళ్లు హత్య చేశారు. ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుడా భర్తతో పాటు అత్తా,మామలు శారీరకంగా హింసించి మరీ చంపేశారు" అని మృతురాలు అంగూరి బేగం సోదరుడు కౌషర్ రాజా తెలిపారు.