" ఈ రోజు ఇక్కడ ఏమీ జరగలేదు. మనింటికి ఎవరూ రాలేదు. మనం ఏమీ చేయలేదు. ఈ రోజు అసలు ఏమీ జరగలేదు. మొత్తం మర్చిపోదాం.. అర్థమైందా  "  అని దృశ్యం సినిమాలో వెంకటేష్ తన ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పే సీన్ హైలెట్. దీని మీద సోషల్ మీడియాలో లెక్క లేనన్ని మీమ్స్ వచ్చాయి.  ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే " అసలు ఈ రోజు మనం మ్యాచే జరగలేదు.. మనం మ్యాచే చూడలేదు.. అర్థమైందా ? "  అంటూ మీమ్స్ తయారు చేసి వదులుతూ ఉంటారు. దీన్ని చాలా మంది కామెడీగా తీసుకున్నారు కానీ బెంగళూరులోని ఓ ఫ్యామిలీ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎంత సీరియస్‌గా అంటే తాము నేరం చేసి .. అదే పద్దతి ఫాలో కావాలని డిసైడ్ అయ్యేంతగా !


కర్మాటకలోని అనేకల్ అనే ప్రాంతంలో రవిప్రకాష్ అనే వ్యక్తి  కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతనితో పాటు కూతురు, అల్లుడు, కొడుకు , కోడలు నివసిస్తూ ఉంటారు. హఠాత్తుగా అతని ఇంట్లో బంగారం పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఆ బంగారాన్ని రికవరీ చేశారు. కానీ వాళ్లనే అరెస్ట్ చేశారు. వాళ్లు "మాకేం తెలియదు.. మాకేం తెలియదు" అని అంటూనే  ఓ క్లూ వాళ్లే పోలీసులకు ఇచ్చారు. మిగతా పని పోలీసులు పూర్తి చేశారు.


రవిప్రకాష్ దృశ్యం సినిమా చూసి బాగా ఇన్‌స్పయిర్ అయ్యాడు.  హత్యలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అదే ప్లాన్‌తో దొంగతనం చేయాలనుకున్నాడు. ఎవరి ఇంటినో దొంగతనం చేస్తే దానికి దృశ్యం సినిమా చూసి ఇన్‌స్పయిర్ అవ్వాల్సిన పని లేదు. తన ఇంట్లోనే బంగారం దొంగతనం చేశాడు. తీసుకెళ్లి ఓ వడ్డీ వ్యాపారి దగ్గర అమ్మేశాడు. అమ్మేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా డ్రైవర్‌ను పంపాడు. ఆ కొనుక్కున్నోళ్లకి ఎవరు అమ్మారో తెలియకుండా చేశాడు. తర్వాత వెళ్లి తన బంగారం చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇంట్లో వాళ్లందరికీ ముందే చెప్పాడు. దృశ్యం సినిమా చూపించి.. " మాకేం తెలియదు..మాకేం తెలియదు " అని చెప్పాలని ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్లు అలాగే చెప్పారు. చివరికి పోలీసులు సీరియస్‌గా సెర్చ్ చేసి.. ఆ బంగారాన్ని రికవరీ చేశారు. దీంతో ప్లాన్ వర్కవుట్ అయింది. దాదాపుగా కేజీ బంగారం తిరిగి వచ్చింది.. వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకున్న డబ్బులూ మిగిలాయి. 


అయితే ఏదైనా స్టోరీ ఒక్క సారే హిట్ అవుతుంది. రెండో సారి ప్లాట్ మార్చాలి. లేకపోతే ఫ్లాపవుతుంది. ఆ విషయం రవిప్రకాష్ అర్థం చేసుకోలేకపోయారు. రెండో సారి అదే ప్లాన్ చేశారు. పోలీసులు మళ్లీ రికవరీ చేశారు. కానీ వాళ్ల తీరులో తేడా చూసి.. మొత్తం బయటకు లాగారు. అంతే  మొదటికే మోసం వచ్చింది. ఆ ఫ్యామిలీ మొత్తం జైల్లో కూర్చున్నారు. ఇప్పుడీ ఫ్యామిలీ  మెంబర్స్ ఐదుగురితో పాటు.. మరో ఇద్దరుజైల్లో ఉన్నారు. మొదటి సారి చేసిన ఫ్రాడ్ డబ్బులు కూడా పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫ్యామిలీ దృశ్యం కథ ఇప్పుడు కర్ణాటకలో  హాట టాపిక్ అవుతోంది.