తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ రూరల్ బోట్ క్లబ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. బోట్ క్లబ్ చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు పిల్లలు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం సెలవు కావడంతో బోట్ క్లబ్ చెరువులో సరదాగా చేపలు గేలం వేస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లిన చిన్నారులు, ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లలు కిలాడీ నాగయక్ష సూర్య కుమార్(12), వాసంతి నోవా(10). ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్న రోధిస్తున్నారు. బోట్ క్లబ్ చెరువు చుట్టూ రక్షణ వలయం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 


రోడ్డు ప్రమాదంలో మూడేళ్ళ బాలిక మృతి


విశాఖపట్నం జూ పార్కు జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ  ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతులు, మూడేళ్ల చిన్నారి కింద పడిపోయారు. అయితే దంపతలు ఇద్దరు కొద్దీ పాటి గాయలుతో బయటపడ్డారు. కానీ కిందపడిపోయిన చిన్నారి పై నుంచి కారు దూసుకుపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన నిహారిక(3) అనే చిన్నారి మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్లిపోతుండగా స్థానికులు వెంటపడి ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును నడిపే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మూడేళ్ల చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. 



ముగ్గురు చిన్నారులతో జూరాల కాల్వలో దూకిన తల్లి


కుటుంబ తగాదాల కారణంతో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి జూరాల కాల్వలో దూకింది. తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా కాల్వలో కొట్టుకుపోతున్న మరో బాలుడిని స్థానికులు రక్షించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సాయంతో గల్లంతైన వారిని గాలింపు చేపట్టారు. భర్త వేధింపులే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.