అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్ర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల్లోకెళితే అనంతపురం నగరం నుంచి నాగర్ కోయిల్ కు టమోటా లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం నేషనల్ పార్క్ సమీపంలోని బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఐచర్ వాహనం పక్కనే వెళుతున్న ద్విచక్ర వాహనంపై పడడంతో మోటర్ బైక్ పై వెళుతున్న భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు.


బైక్ నడుపుతున్న వ్యక్తి తల, మొండెం వేరువేరుగా పడటంతో భయానక వాతావరణం కనిపించింది. మృతి చెందిన భార్యాభర్తలు గుత్తి మండలం హనుమంతు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై టమోటా లోడ్ తో వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా పడడంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఐచర్ వాహనాన్ని పక్కకు తప్పించి రహదారిపై పడ్డ టమాటోలను టమాటో గుట్టలను పక్కకు తొలగించారు. మృతిచెందిన దంపతులను పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.


Also Read: Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష