Woman Jumped Into The Canal With Her Two Children: ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో.. ఏమో..? తన ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ తీవ్ర విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో (Vijayawada) ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బందరు కాలువలో దూకింది. దీన్ని గమనించిన స్థానికులు ఏడాది వయసున్న చిన్నారిని బయటకు తీశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ, మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 


భార్య గొంతు కోసిన భర్త


అటు, అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన వన్నూరు స్వామికి.. అదే గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెకు నచ్చచెప్పేందుకు ఆమె ఇంటికి వెళ్లిన స్వామి ఆదివారం తెల్లవారుజామున భార్య గొంతు కోసి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.


Also Read: Crime News: నిద్ర లేచి చూసే సరికి రూ.2.50 కోట్ల బంగారం దోచేశారు - రైలులో భారీ దోపిడీ, ఎక్కడంటే?