Man Severly Injured Who Fell From The Tree In Suryapeta: తీవ్ర విషాదం వెంటే అనుకోని ప్రమాదం జరిగిన ఘటన ఇది. చెట్టుపై ఉరేసుకున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని కిందకు దించేందుకు మరో వ్యక్తి చెట్టు ఎక్కుతుండగా ఆ మృతదేహం అతనిపై పడి తీవ్ర గాయాలపాలైన ఘటన సూర్యాపేట జిల్లాలో  (Suryapeta News) శుక్రవారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (75) రోజూ మాదిరిగానే కల్లు తీయడానికి ఉదయం గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కాడు. అనంతరం చెట్టుపై ఉరేసుకుని మృతి చెందాడు. చెట్టుపై మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించేందుకు యత్నించారు. 


ఊహించని ప్రమాదం






అదే గ్రామానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి మృతదేహాన్ని కిందకు దించేందుకు సిద్ధమై చెట్టు ఎక్కుతుండగా.. అకస్మాత్తుగా ఆ మృతదేహం నాగార్జునపై పడింది. దీంతో అతను కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు అతన్ని కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, తన భార్య మానసిక స్థితి బాగాలేకపోవడంతో పాటు కుటుంబ, ఆర్థిక సమస్యలతోనే వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి బంధువు నరేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Crime News: తెలంగాణలో దారుణం - తీసుకున్న అప్పు చెల్లించలేదని సుత్తితో కొట్టి చంపేసింది