అప్పుల అప్పారావు నుంచి అప్పు వసూలు చేసుకోవడం గొప్ప పనే. అప్పు చెల్లించడమే అలవాటు లేని వారి దగ్గర.. రికవరీ చేయడం అంటే.. బ్యాంకులకైనా తల ప్రాణం తోకకు వస్తుంది. బ్యాంకుల వద్ద అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా అలాంటి అప్పుల అప్పారావే. ఆయన నుంచి డబ్బులు వసూలు చేసుకోలేక.. ఆయన ఆస్తులు వేలం వేసుకోలేక.. ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఆస్తులన్నీ అటాచ్ చేసుకుని.. వేలం వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆయనను ఇండియాకు రప్పించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే.. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాయి. 


అలాంటి వ్యాపారవేత్త విజయ్ మాల్యా దగ్గర నుంచి ఓ బ్యాంక్ మొత్తం అప్పులను రికవరీ చేసుకుంది. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా నిజమే. ఆయన తమ వద్ద తీసుకున్న అప్పులను మొత్తం తిరిగి చెల్లించారని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అధికారికంగా ప్రకటించింది. విజయ్ మాల్యా తమ వద్ద తీసుకున్న రుణానికి వడ్డీతో సహా రూ. 753 కోట్లు చెల్లించారని ప్రకటించారు. మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఐడీబీఐ వద్ద అప్పులు తీసుకున్నారు. తర్వాత ఆ సంస్థ దివాలా తీసింది. విజయ్ మాల్యా డబ్బులు చెల్లించకుండా లండన్‌కు మకాం మార్చారు. కానీ ఆయన ఐడీబీఐకి మాత్రం అప్పులు చెల్లించారు. 


మాల్యా లండన్ పారిపోయిన తర్వాత బ్యాంకులు.. మాల్యాకు చెందిన ఆస్తులను వేలం వేయడం ప్రారంభించాయి. గోవాలో ఉన్న మాల్యా హౌస్‌ను అమ్మేశారు. ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తులను కొనడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో బ్యాంకులకు గిట్టుబాటు కాలేదు. ప్రస్తుతం ఆ ఆస్తులన్నీ ఈడీ అటాచ్‌లో ఉన్నాయి.  విజయ్ మాల్యా లండన్ పారిపోయినప్పటి నుండి తాను డబ్బులు తిరిగి కడతాననే చెబుతూ వస్తున్నారు. నిజానికి విజయ్ మాల్యా చాలా కాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. బాకీ మొత్తం బ్యాంకులకు చెల్లిస్తానని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. మొత్తంగా బ్యాంకులకు రూ.13,960 కోట్లు చెల్లిస్తానని ఆయన అంటున్నారు. మొత్తంగా సెటిల్మెంట్ ప్యాకేజీ కింద.. చెల్లించేందుకు సిద్ధమని చెబుతున్నారు. అయితే తిరిగి ఇస్తూంటే ఎవరు వద్దంటారు... కానీ ఆయన మాత్రం ఓ షరతు పెడుతున్నారు. అదేమిటంటే.. ముందుగా తన ఆస్తులను అటాచ్‌మెంట్ నుంచి విడిపిస్తే.. వాటిని అమ్మేసి  బాకీ తీరుస్తానని ఆయన అంటున్నారు.  విజయ్ మాల్యాను మాత్రం నమ్మలేమని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.