Train Travel Insurance: రైలు ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది. ట్రైన్‌ జర్నీ చేసే ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయల ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అయ్యేలా టిక్కెట్‌ బుకింగ్‌లో మార్పు చేసింది.


రైలు ప్రయాణం కోసం IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ బుక్ చేసే సమయంలో, ట్రావెల్ ఇన్సూరెన్స్ (travel insurance) ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. చాలా మంది దీనిని టిక్‌ చేయరు, లేదా మరిచిపోతుంటారు. వాస్తవానికి ఈ ఇన్సూరెన్స్‌ పాలసీ విలువ కేవలం 35 పైసలు. ఈ పాలసీ తీసుకుంటే, జర్నీ పూర్తయ్యే వరకు సదరు పాసింజర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజ్‌లో ఉంటాడు. జర్నీలో ఏదైనా ప్రమాదం జరిగితే, ప్రయాణీకుడికి లేదా అతని కుటుంబానికి రూ. 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.


IRCTC వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు దాదాపు 15 లక్షల మంది టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసే ప్రతి వ్యక్తి... వయస్సు, వర్గం, అనారోగ్యం వంటి ఏ కారణంతో సంబంధం లేకుండా యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ (accident insurance) తీసుకోవడానికి ఎలిజిబుల్‌ అవుతారు. టిక్కెట్‌ బుక్‌ చేసే టైమ్‌లోనే ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌తో ఒక బాక్స్‌ కనిపిస్తుంది. టిక్కెట్‌ బుక్‌ చేసే వ్యక్తి ఆ బాక్స్‌లో టిక్‌ చేస్తే చాలు, ఇన్సూరెన్స్‌ అప్లికబుల్‌ అవుతుంది. అయితే, చాలా మంది ఈ ఆప్షన్‌ తీసుకోవడం లేదు. టిక్కెట్‌ బుక్‌ చేసుకునే తొందరలో కొందరు దీనిని గమనించడం లేదు. గమనించిన వారిలో మరికొందరు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఇటీవల, ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారిలో కొంతమంది ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోలేదు. దానివల్ల వాళ్ల కుటుంబానికి పెద్ద ఆర్థిక సాయం మిస్సయింది.


టికెట్ బుకింగ్‌ ప్రాసెస్‌లో చిన్న మార్పు
ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ అందాలనే ఉద్దేశంతో, ₹10 లక్షల ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఆటోమేటిక్‌గా అప్లై అయ్యేలా టికెట్ బుకింగ్‌ ప్రాసెస్‌లో చిన్న మార్పు చేసింది రైల్వే శాఖ. కేవలం 35 పైసలకే లభించే ఇన్సూరెన్స్‌ ఫెసిలిటీని డిఫాల్ట్‌ చేసింది. అంటే, ఇన్సూరెన్స్‌ మీద ఆటోమేటిక్‌గా టిక్‌ ఉంటుంది. ఇప్పుడు దీనిని ప్రయాణీకులు గమనించినా, గమనించకపోయినా.. అందరికీ ప్రమాద బీమా వర్తిస్తుంది. ఒకవేళ దీనిని వద్దు అనుకుంటే టిక్‌ తీసేస్తే సరిపోతుంది.


ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు?
రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పుడు, రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ. 10 లక్షలు అందుతుంది. ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తి స్థాయి అంగవైకల్యానికి గురైతే బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలు పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ. 7.5 లక్షలు, గాయాలు అయితే రూ. 2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, అవసరమైన పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు. 


ఇన్సూరెన్స్‌ రూల్స్‌ ప్రకారం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి నామినీ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేయడం ఈజీగా ఉంటుంది.


ఇది కూడా చదవండి: భయపెడుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial