Developed India Goal: 2047 నాటికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యం గురించి ప్రధాని మోదీ గత రెండేళ్లుగా చెబుతున్నారు. ఇందుకోసం "వికసిత్‌ భారత్‌" ప్రచారాన్ని ప్రారంభించారు. డెవలప్డ్‌ ఎకానమీ లక్ష్య సాధన కోసం నాలుగు రంగాలు అత్యంత కీలకమని, మోదీ 3.0 అజెండాలో వాటికే అధిక ప్రాధాన్యత ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


1. మౌలిక సదుపాయాలు


మోదీ హయాంలో, గత పదేళ్లలో, దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. హైవేలు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలను అనుసంధానించారు & ఆధునీకరించారు. కన్సల్టెన్సీ సంస్థ వెరిస్క్ మాపుల్‌క్రాఫ్ట్‌ లెక్క ప్రకారం, 2047 నాటికి భారతదేశం 26 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, మౌలిక సదుపాయాల విస్తరణలో వేగం పెంచడం కీలకం. ఈ రంగంలో భారత్‌ ఇప్పటికీ చైనా కంటే వెనుకబడి ఉంది. ఈ గ్యాప్‌ పూడ్చడానికి & విదేశీ పెట్టుబడిదార్లను ఆకర్షించడానికి, ఇప్పుడున్న స్పీడ్‌ కంటే డబుల్‌ స్పీడ్‌తో మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగించాలి. 


ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌లో, 2024-25లో మూలధన వ్యయం 11.1% పెరిగి 11.11 లక్షల కోట్ల రూపాయలకు ($133.9 బిలియన్లు) చేరుతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అంచనా వేశారు. రైల్వేలు, విమానాశ్రయాల అభివృద్ధిపై ఆమె ఎక్కువ ఫోకస్‌ పెట్టారు.


2. తయారీ రంగం


గత దశాబ్ద కాలంగా స్వావలంబన దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. చైనాను అధిగమించి ఆసియాలో అతి పెద్ద తయారీ కేంద్రంగా నిలవాలని, ముఖ్యంగా చిప్‌ల తయారీలో దూకుడుగా వ్యవహరించాలని మోదీ కోరుకుంటున్నారు. చైనా ప్లస్‌ వ్యూహంలో భాగంగా, గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు 'భారత్‌లో తయారీ'పై దృష్టి పెట్టాయి. మేడ్‌ ఇన్‌ ఇండియా ఆపిల్‌ ఐఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. iPhone 16 కోసం భారత్‌ నుంచే బ్యాటరీలు సేకరించేందుకు ఆపిల్‌ సిద్దమైంది. గూగుల్‌ కూడా, ఈ త్రైమాసికంలో, మన దేశంలో పిక్సెల్ ఫోన్ ఉత్పత్తిని ప్రారంభించొచ్చు. మైక్రాన్ టెక్నాలజీ కూడా 2025 ప్రారంభంలో భారత్‌లో మొట్టమొదటి సెమీకండక్టర్ చిప్‌ రూపొందించడానికి సిద్ధంగా ఉంది.


కౌంటర్‌పాయింట్ రీసెర్చ్, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ అంచనాల ప్రకారం... 2026 నాటికి భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ విలువ 64 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. 2019లోని 23 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందుతుంది. సెమీకండక్టర్ల తయారీ వ్యాపారంలో భారతదేశం నిలదొక్కుకోగలిగితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. 


3. ఉపాధి


ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో నిరుద్యోగిత ఒకటి, నైపుణ్యాల లేమి ఈ సమస్యను మరింత క్లిష్టంగా మారుస్తోంది. కార్మికుల్లో ఉన్న నైపుణ్య స్థాయికి - కంపెనీలు డిమాండ్‌ చేస్తున్న నైపుణ్య స్థాయికి మధ్య పొంతన కుదరడం లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రచురించిన రిపోర్ట్‌ ప్రకారం.. మన దేశంలో నిరుద్యోగిత రేటు 2024 మార్చిలోని 7.4% నుంచి ఏప్రిల్‌లో 8.1%కు పెరిగింది.


ఎన్నికల ముందు, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ నిర్వహించిన సర్వేలో... ప్రతి 10,000 మందిలో 2,700 మందికి (27%) ఉన్న ప్రధాన ఆందోళన నిరుద్యోగం. మోదీ 2.0 హయాంలో ఉద్యోగం దొరకడం కష్టంగా మారిందని ఈ సర్వేలో పాల్గొన్న సగం మంది పైగా ‍‌(62%) చెప్పారు.


ప్రజలకు, ముఖ్యంగా యువతకు సరైన రంగంలో ఉపాధి దొరికేలా విద్య ప్రమాణాలు & నైపుణ్య శిక్షణలు మెరుగుపరచడం మోదీ 3.0 సర్కారు ముందున్న సవాలు. మహిళలకు ఉపాధిని పెంచడం కూడా ముఖ్యమే. 


4. విదేశీ పెట్టుబడులు


ప్రస్తుతం, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విలువ దాదాపు 4.9 లక్షల కోట్ల డాలర్లు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఇది మూడో అతి పెద్ద మార్కెట్‌. రాబోయే 20 ఏళ్లలో ఈ మార్కెట్ క్యాప్ 40 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. 


భారతదేశ ఆర్థిక వృద్ధి డబుల్‌ ఇంజిన్‌లా పరుగెత్తాలంటే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరగాలి. అమెరికాలో గరిష్ట స్థాయిలో ఉన్న వడ్డీ రేట్ల కారణంగా గత సంవత్సరం భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో వేగం తగ్గింది. అక్కడ వడ్డీ రేట్లు తగ్గడం మొదలైతే, U.S. నుంచి భారత్‌లోకి FDI ప్రవాహాలు వేగంగా పెరగొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ చెబుతోంది. RBI కఠిన నిబంధనల కారణంగా.. క్రమశిక్షణతో నడుచుకుంటున్న & ఆర్థికంగా పటిష్టంగా ఉన్న భారతదేశ బ్యాంకింగ్ రంగంపై గ్లోబల్‌ పెట్టుబడిదార్ల శ్రద్ధ పెరుగుతుందని వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: భయపెడుతున్న వెండి రేటు, పసిడే కాస్త బెటర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి