GST Council Meeting Decisions September 2024: దేశంలోని వేలాది మంది కేన్సర్‌ రోగులకు చల్లటి కబురు అందింది. కేన్సర్‌ రోగులు వినియోగించే ఔషధాల ఖర్చు ఇకపై తగ్గనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సోమవారం (09 సెప్టెంబర్‌ 2024) జరిగిన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, చాలా కాలంగా దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్న కొన్ని అంశాలను వాయిదా వేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. 


కేన్సర్‌ మందులపై పన్ను తగ్గింపు (GST reduced on cancer-related drugs)
క్యాన్సర్ మందుల విషయంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ మందులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్‌టీని (వస్తు & సేవల పన్ను) 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో కేన్సర్‌ మందుల రేట్లు తగ్గి రోగుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. అంతేకాదు.. నమ్‌కీన్‌ (namkeen), మతపరమైన యాత్రలకు హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకోవడంపైనా పన్నును తగ్గించింది. నమ్‌కీన్‌ (మిక్చర్‌) మీద ఇకపై 18 శాతానికి బదులు 12 శాతం పన్ను విధిస్తారు, దీనివల్ల ఆ చిరుతిండి రేట్లు కొంతమేర తగ్గుతాయి. 


మతపరమైన యాత్రలకు హెలికాఫ్టర్‌ .వినియోగిస్తే, ఆ బిల్లుపై వసూలు చేసే జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తూ మండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారిని, ముఖ్యంగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్, వైష్ణోదేవి యాత్రికులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. హెలికాప్టర్‌లో సీట్ల షేరింగ్‌ ప్రాతిపదికన వెళ్లేవారికి 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. చార్టర్‌ హెలికాప్టర్‌ తరహాలో ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ అద్దెకు తీసుకుని వెళ్తే మాత్రం 18 శాతం జీఎస్‌టీ కట్టాలి.


బీమా ప్రీమియంపై పన్ను తగ్గింపు నిర్ణయం వాయిదా
జీవిత బీమా (Life insurance), ఆరోగ్య బీమా (Health insurance) ప్రీమియం మీద జీఎస్‌టీని తగ్గించే అంశం వాయిదా పడింది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని మండలి నిర్ణయించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను తగ్గిస్తారని దేశవ్యాప్తంగా భారీగా చర్చ నడిచింది. అయితే, పన్ను తగ్గింపు నిర్ణయాన్ని వచ్చే సమావేశం వరకు వాయిదా వేసిన కౌన్సిల్‌, ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించి రిపోర్ట్‌ చేసేందుకు మంత్రుల కమిటీని (GoM) ఏర్పాటు చేసింది. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి నేతృత్వంలోని GoM ఏర్పాటైంది. ఈ కమిటీ, తన నివేదికను అక్టోబర్‌ నెలాఖరు నాటికి కౌన్సిల్‌కు సమర్పిస్తుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌లోని మెజార్టీ మెంబర్లు మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రస్తుతం లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలపై 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు.


ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్‌ల నుంచి భారీ ఆదాయం
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై జీఎస్టీ విధించి 6 నెలల తర్వాత ఇచ్చిన నివేదికపై చర్చించామని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఆదాయం 412 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకుందని చెప్పారు. గతంలో ఇది రూ.1,349 కోట్లుగా ఉంది. 2023 అక్టోబరు 01 నుంచి, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్ను విధించారు.DGCA గుర్తింపు ఉన్న విమాన పైలెట్‌ శిక్షణ సంస్థలు అందించే కోర్సులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.