Barber Owns 400 Luxury Cars: రిక్షా తొక్కి, పేపర్‌ & పాల ప్యాకెట్లు వేసి సినిమాలో హీరోలు లక్షాధికార్లు అవుతారు. మరి నిజ జీవితంలో?. అలాంటి పనులే చేసి లక్షాధికారులేం ఖర్మ, ఏకంగా కోటీశ్వరులు కూడా కావచ్చు. దానికి కసి ఉండాలి, కృషి చేయాలి. అప్పుడు కాలం కూడా కలిసొస్తుంది. రమేష్‌ బాబు జీవితమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.


భారత ఆర్థిక వ్యవస్థలో విపరీతమైన బూమ్ కారణంగా, దేశంలో ధనవంతుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కొత్త కోటీశ్వరులు ఈ లిస్ట్‌లో చేరుతూనే ఉన్నారు. అలా, కొత్తగా ధనవంతుల లిస్ట్‌లోకి చేరిన వ్యక్తి రమేష్‌ బాబు. అతని గురించి ఆరా తీస్తే చాలా ఆసక్తికరమైన & అంతకంటే ఆశ్చర్యకరమైన విశేషాలు బయటికొచ్చాయి. ఇప్పుడు 400 కార్లు, 1200 కోట్ల రూపాయలకు యజమానిగా ఉన్న రమేష్ బాబు.. ఒకప్పుడు బార్బర్‌. అతను విధిని జయించాడు. తన జీవిత గమనాన్ని తానే రాసుకున్నాడు. 


ఒక విశేషం ఏంటంటే... కార్ రెంటల్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ముఖేష్ బాబు దగ్గర అంబానీ, రతన్ టాటాల కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి. 


వార్తాపత్రికలు పంచి, పాలు అమ్ముతూ, బార్బర్ షాపు నడిపి...
రమేష్ బాబును సెల్ఫ్ మేడ్ బిలియనీర్‌గా (Self Made Billionaire) పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లు అతని దగ్గర ఉన్నాయి. రమేష్‌ బాబు పూర్వీకుల ఆస్తి పేరిట ఏమీ లేదు. కానీ ఇవాళ కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అద్దె కార్ల పరిశ్రమలో రాజుగా నిలబడ్డాడు. 


రమేష్‌ బాబు బాల్యం పేదరికంలో ప్రారంభమైంది. తన కుటుంబం కోసం 13 సంవత్సరాల వయస్సు నుంచే పని చేయడం ప్రారంభించాడు. వీధుల్లో తిరిగి వార్తాపత్రికలు వేశాడు, పాలు అమ్మాడు. తన తండ్రికి రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాప్‌లో కూడా పని చేశాడు. అయినప్పటికీ రోజూ స్కూల్‌కు వెళ్లేవాడు, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా తీసుకున్నాడు.


జీవితాన్ని మార్చిన మారుతీ ఓమ్నీ
యుక్త వయస్సు నుంచి రమేష్‌ బాబుకు కార్ రెంటల్ ఇండస్ట్రీ మీద ఆసక్తి ఉండేదు. ఆ ఇష్టంతోనే, 1993లో మారుతీ ఓమ్నీని కొనుగోలు చేశాడు. రమేష్ టూర్స్ & ట్రావెల్స్ (Ramesh Tours & Travels) పేరుతో బెంగళూరులో వ్యాపారం ప్రారంభించాడు. లాభం పెరగడంతో, అతని కార్ల సముదాయం పెరుగుతూ వచ్చింది. మొదట్లో తానే స్వయంగా కారు నడిపాడు. వ్యాపారం పెరిగిన తర్వాత డ్రైవర్లను నియమించుకున్నాడు. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో, డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాడు. క్రమంగా బెంగళూరులోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకడిగా మారాడు. 


మెర్సిడెస్, రోల్స్ రాయిస్ కార్లు
2004లో, సంపన్న ఖాతాదార్ల వైపు దృష్టి సారించాడు రమేష్‌ బాబు. మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ సెడాన్ అతని అతని మొదటి లగ్జరీ కారు. రమేష్‌ బాబు వేసిన ఎత్తుగడ విజయవంతమైంది, కార్ రెంటల్ మార్కెట్‌లో మకుటం లేని చక్రవర్తిగా అవతరించాడు. ఇప్పుడు, రమేష్‌ బాబు వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్‌, మెర్సిడెస్ మేబ్యాక్ కూడా ఉన్నాయి. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు కార్ రెంటల్ ఇండస్ట్రీల్లో అత్యుత్తమ కంపెనీగా మారింది. చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు రమేష్‌ బాబు కస్టమర్లుగా మారారు.


మరో ఆసక్తికర కథనం: ఈ పండుగ సీజన్‌లో ఇ-కామర్స్‌ కంపెనీలు ఎంత ఆర్జిస్తాయో తెలుసా? - లెక్కలు చూస్తే మైండ్‌ బ్లాంక్‌