E-Commerce Sale in Festive Season: మన దేశంలో వినాయక చవితితో పండుగల పరంపర ప్రారంభమైంది. అక్టోబర్‌లో దసరా నవరాత్రులు, దీపావళి వేడుకలతో ఫెస్టివ్‌ సీజన్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పండుగల సీజన్‌లో బిజినెస్‌లు, ఆర్థిక వ్యవస్థ ఊపందుకోనున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో క్రమంగా పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ వల్ల, ఈ-కామర్స్ రంగానికి పండుగ సీజన్‌ అతి ప్రత్యేకంగా మారింది. ఈసారి కూడా పండుగల సమయంలో ఈ-కామర్స్ కంపెనీల విక్రయాలు విపరీతంగా సాగుతాయని అంచనా.


ఆన్‌లైన్ అమ్మకాలు హై రేంజ్‌లో పెరిగే అవకాశం
ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఇ-కామర్స్ కంపెనీల అమ్మకాలు 12 బిలియన్ అమెరికన్‌ డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ పరిశోధన సంస్థ డేటామ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక సూచిస్తోంది. 12 బిలియన్ అమెరికన్‌ డాలర్లను ఇండియన్‌ రూపాయల్లోకి మారిస్తే.... 12,00,00,00,000 రూపాయలు అవుతుంది. అంటే, ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో, కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసమే భారతీయులు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. గత సంవత్సరం పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో సుమారు 9.7 బిలియన్‌ డాలర్ల (970 కోట్ల రూపాయల) విలువైన వస్తువులు సేల్‌ అయ్యాయి. ఈసారి పండుగ సీజన్‌లో విక్రయాలు 23 శాతం పెరుగుతాయని పరిశోధన సంస్థ అభిప్రాయపడింది.


క్విక్‌ కామర్స్‌ సేల్స్‌ హవా
డేటామ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ ప్రకారం, వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్‌ కామర్స్‌ విభాగం ఈసారి కూడా ఇ-కామర్స్ కంపెనీల మొత్తం అమ్మకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో, క్విక్‌ కామర్స్‌ సెగ్మెంట్‌ నుంచి సుమారు 1 బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు జరుగుతాయని అంచనా. ఈ రిపోర్ట్‌ కోసం, GMVని (స్థూల వ్యాపార విలువ) పరిశోధన సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుంచి అమ్ముడైన వివిధ వస్తువుల మొత్తం అమ్మకాల విలువ GMVలో ఉంటుంది. కంపెనీల డిస్కౌంట్‌లు, ఆఫర్లు దీనిలోకి రావు.


ఈసారి ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువులు
నివేదిక ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో జరిగే ఆన్‌లైన్‌ అమ్మకాల్లో మొబైల్, ఫ్యాషన్ సెగ్మెంట్లలో సేల్స్‌ అతి ఎక్కువగా ఉండొచ్చు. ఆన్‌లైన్ అమ్మకాల్లో వీటిదే సగం వాటా, అంటే 50 శాతం వాటా ఉండొచ్చు. కిరాణా విక్రయాలలో క్విక్ కామర్స్ వాటా వేగంగా పెరుగుతోంది. పండుగ సీజన్‌లో, ఆన్‌లైన్‌లో కిరాణా విక్రయాల్లో క్విక్‌ కామర్స్‌ కాంట్రిబ్యూషన్‌ 50 శాతానికి చేరుకోవచ్చని తాజా రిపోర్ట్‌లో అంచనా వేశారు. గత సంవత్సరం ఇది 37.6 శాతంగా ఉంది.


సెప్టెంబర్ 27 నుంచి ఫెస్టివ్‌ సీజన్ సేల్స్‌
సాధారణంగా, ప్రతి సంవత్సరం పండుగ నెలల్లో భారతదేశంలోని అన్ని రంగాల్లో అమ్మకాలు పెరుగుతాయి. పండుగల సమయంలో ప్రజలు సర్ఫ్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వరకు, కార్పెట్‌ నుంచి కార్లు, బైకుల వరకు అన్ని రకాల వస్తువులను కొంటుంటారు. పండుగ నాటికి కొత్త బట్టలు, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు తమ ఇళ్లలో ఉండాలని ఆశపడతారు. ప్రజల ఆశలను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కూడా స్పెషల్‌ డిస్కౌంట్‌ సేల్స్‌ను నిర్వహిస్తున్నాయి. 


ఈసారి అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ & ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌ ఈ నెల 27 (సెప్టెంబర్‌ 27) నుంచి ప్రారంభమవుతాయి. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ కస్టమర్లకు ఒకరోజు ముందే (సెప్టెంబర్‌ 26 నుంచి) సేల్‌ అందుబాటులోకి వస్తుంది. 


మరో ఆసక్తికర కథనం: కార్‌ కొన్నంత ఈజీగా 1000 కోట్ల విమానం కొన్నాడు - అలాంటిది దేశంలో మరోటి లేదు