Stock Market Today, 26 February 2024: గత వారంలో రికార్డ్‌ గరిష్టాలకు ఎక్కిన NSE బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ50, ఈ రోజు ‍‌(సోమవారం) ట్రేడ్‌ను నిరాడంబరంగా ప్రారంభించే అవకాశం ఉంది.


ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 67 పాయింట్లు లేదా 0.3 శాతం రెడ్‌ కలర్‌లో 22,222 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


డిజాస్టర్ రికవరీ సన్నద్ధతతో భాగంగా, ఈ శనివారం (02 మార్చి 2024) నాడు స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్ జరుగుతుంది. శనివారం రోజున రెండు సెషన్లలో.. ఉదయం 09.15 నుంచి 10 గంటల వరకు ఒక సెషన్‌గా, ఆ తర్వాత ఉదయం 11.30 తర్వాత రెండో సెషన్‌గా ట్రేడ్‌ జరుగుతుంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా షేర్లు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ తన రికార్డు రన్‌ను కంటిన్యూ చేసింది, 0.6 శాతం లాభాల్లో ఉంది. తైవాన్ మార్కెట్‌ 0.4 శాతం పెరిగింది. కోస్పి 1.3 శాతం క్షీణించగా, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం పడిపోయింది.


గత శుక్రవారం, ఎన్‌విడియా బూస్ట్‌తో US స్టాక్స్ లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్‌, S&P 500 కొత్త గరిష్టాలను నమోదు చేశాయి. అయితే, బలమైన ఆర్థిక వృద్ధి నమోదుతో పాటు ద్రవ్యోల్బణం చల్లబడడం వంటి వాటి వల్ల వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావచ్చన్న అంచనాల నడుమ లాభాలు తగ్గాయి.


US 10-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.223 శాతానికి చేరింది బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌కు $80.50కు పడిపోయింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


రిలయన్స్: నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, భారతదేశంలో మీడియా కార్యకలాపాలను మెర్జ్‌ చేయడానికి వాల్ట్ డిస్నీ - రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి.


మారుతి సుజుకి: గ్రీన్ వెహికల్ సెగ్మెంట్, భవిష్యత్‌లో, మొత్తం కంపెనీ అమ్మకాలలో 25 శాతం వరకు ఉంటుందని మారుతి సుజుకి అంచనా వేసింది. హైబ్రిడ్ కార్లు పెద్ద పాత్ర పోషిస్తాయని లెక్కగట్టింది.


కల్యాణి స్టీల్స్: రూ.11,750 కోట్ల పెట్టుబడితో తయారీ ఫ్లాంటును ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.


HDFC బ్యాంక్: ఎడ్యుకేషన్ లోన్స్‌ ఇచ్చే అనుబంధ సంస్థ HDFC క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోని తన 90 శాతం వాటాను అమ్మడానికి ఆర్‌బీఐ నుంచి అనుమతి వచ్చింది. BPEA EQT, ChrysCapital గ్రూప్‌తో సహా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థల కన్సార్టియంకు ఈ వాటాను HDFC బ్యాంక్ విక్రయిస్తుంది. 


ఇన్ఫీబీమ్ అవెన్యూస్: USకు చెందిన AI డెవలప్‌మెంట్ కంపెనీ అయిన XDuceలో 20 శాతం వాటాను $10 మిలియన్లకు కొనుగోలు చేసింది. 


కోటక్ మహీంద్ర బ్యాంక్: జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగం కోటక్ మహీంద్ర జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను రూ. 5,560 కోట్లకు జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం CCI అనుమతి కూడా లభించింది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: ఇటీవలి వార్తల నేపథ్యంలో కంపెనీ పెట్టుబడిదార్ల సంపద క్షీణతను అరికట్టడానికి, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి సతీష్ చంద్ర నేతృత్వంలో స్వతంత్ర సలహా కమిటీని ఏర్పాటు చేసింది.


పేటీఎం: చెల్లింపుల్లో ఇబ్బందులు రాకుండా, పేటీఎం UPI హ్యాండిల్ '@ paytm'ను ఉపయోగించే Paytm పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లను ఇతర బ్యాంకులకు తరలించే అవకాశాన్ని పరిశీలించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (NPCI) RBI కోరింది.


JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ విధానంలో నార్త్ కార్గో బెర్త్-III (NCB-III) యాంత్రీకరణ కోసం VO చిదంబరనార్ పోర్ట్ అథారిటీ నుంచి లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ అందుకుంది. 


అశోక్ లేలాండ్: టీవీఎస్ ట్రక్స్‌లో 49.9 శాతం వాటాను రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ బేజారెత్తిస్తున్న గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే