Stock Market Today, 19 February 2024: గత శుక్రవారం ఒక రేంజ్‌లో పెరిగిన ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌తో ఈ రోజు (సోమవారం) ట్రేడ్‌ను ఆర్భాటం లేకుండా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 08 పాయింట్లు లేదా 0.03 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,114 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆదివారం, చైనాలో వడ్డీ రేట్లను ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ స్థిరంగా ఉంచింది. ఈ ఉదయం, ఆసియా మార్కెట్లు తలో దిక్కులో ముందుకు సాగుతున్నాయి. షాంఘై ఇండెక్స్ 1 శాతం, కోస్పీ 0.9 శాతం పెరిగాయి. హాంగ్ సెంగ్ 1 శాతానికి పైగా జారిపోగా, నిక్కీ 0.4 శాతం పడిపోయింది. స్ట్రెయిట్స్ టైమ్స్, తైవాన్ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.


జనవరిలో, US ప్రొడ్యూసర్స్‌ ప్రైస్‌ ఇండెక్స్‌, మార్కెట్‌ అంచనా 0.1 శాతంకు మించి 0.3 శాతం పెరిగడంతో.. బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతో, శుక్రవారం ట్రేడ్‌లో US మార్కెట్లు రెడ్‌ జోన్‌లో ముగిశాయి. 


US 10-ఇయర్స్‌ బాండ్ ఈల్డ్ గరిష్టంగా 4.33 శాతానికి చేరుకుంది, ఆ తర్వాత 4.293 శాతం వద్ద స్థిరపడింది. 


మిడిల్‌ ఈస్ట్‌ టెన్షన్ల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ దాదాపు $83 మార్కును చేరింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


బజాజ్ ఆటో: రూ. 4,000 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌కు ఈ నెల 29ని రికార్డు తేదీగా నిర్ణయించింది.


ఎయిర్‌టెల్: అమెరికన్‌ ప్రైవేట్ ఈక్విటీ మేజర్ కార్లైల్, భారతి ఎయిర్‌టెల్ డేటా సెంటర్ అనుబంధ సంస్థ అయిన Nxtra డేటాలో తన 25 శాతం వాటాను రూ. 2,500 కోట్లకు విక్రయించడానికి బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరుపుతోంది.


పేటీఎం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు కాకుండా ఇతర బ్యాంక్‌లకు లింక్ అయిన పేటీఎం QR, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్‌ల సేవలు మార్చి 15 తర్వాత కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్‌ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌, తన నోడల్ ఖాతాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మార్చింది.


LIC: ఈ నెల 15న, ఆదాయ పన్ను విభాగం నుంచి రూ. 21,740.77 కోట్ల టాక్స్‌ రిఫండ్‌ పొందింది. కంపెనీ ప్రతిపాదించిన 14 శాతం జీతాల పెంపును ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘాలు శుక్రవారం తిరస్కరించాయి.


టాటా పవర్: జల్పురా ఖుర్జా పవర్ ట్రాన్స్‌మిషన్‌ను రూ. 838 కోట్లతో కొనుగోలు చేసేందుకు REC పవర్ డెవలప్‌మెంట్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందుకుంది.


PB ఫిన్‌టెక్: అనుబంధ సంస్థ అయిన పాలసీబజార్, తన లైసెన్స్‌ను డైరెక్ట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్ నుంచి కాంపోజిట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుంచి ఆమోదం పొందింది.


సూలా వైన్‌యార్డ్స్‌: వెర్లిన్వెస్ట్ ఈ రోజు ఒక్కో షేరును రూ.570 చొప్పున బ్లాక్ డీల్ ద్వారా 8.34 శాతం షేర్లను విక్రయించనుంది.


JSW స్టీల్: ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో సమీకృత తయారీ ఫ్లాంట్‌ను స్థాపించేందుకు దశవారీగా రూ.65,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని JSW గ్రూప్ సంస్థలు ప్లాన్‌ చేస్తున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎటూ కదలని గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే