Stock Market Today, 08 April 2024: తోటి మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీస్తుండడంతో ఈ రోజు (సోమవారం) భారతీయ స్టాక్‌ మార్కెట్లు మెరుగ్గా ప్రారంభం కావచ్చు. 


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,658 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో,  ఈ ఉదయం జపాన్ నికాయ్‌ 1.3 శాతం, టోపిక్స్ 0.77 శాతం పెరిగాయి. దక్షిణ కొరియా కోస్పి, తైవాన్ దాదాపు 0.5 శాతం లాభపడ్డాయి. ఆస్ట్రేలియా ASX 200 0.15 శాతం స్వల్పంగా పెరిగింది. హాంగ్‌కాంగ్‌ హ్యాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.44 శాతం పుంజుకుంది.


అమెరికన్‌ మార్గెట్లలో, శుక్రవారం, S&P 500 ఇండెక్స్ & నాస్‌డాక్ కాంపోజిట్ వరుసగా 1.11 శాతం & 1.24 శాతం అధిక స్థాయిలో ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.80 శాతం పెరిగింది.


అమెరికాలో మార్చి నెల జాబ్‌ రిపోర్ట్‌ స్ట్రాంగ్‌గా ఉండడంతో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.42 శాతానికి జంప్‌ చేసింది. మిడిల్‌ ఈస్ట్‌లో టెన్షన్లు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 2% పతనమై $90 దిగువకు చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,346 దగ్గర ఉంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


హెల్త్‌కేర్: మెడికాను కొనుగోలు చేసేందుకు మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ.1,400 కోట్ల డీల్‌ను క్లోజ్‌ చేయబోతోంది, హెల్త్‌కేర్ కంపెనీల షేర్లు మార్కెట్‌ దృష్టిలో ఉంటాయి. ఈ డీల్‌ తర్వాత మణిపాల్ ఆసుపత్రి 10,700 పడకలతో అపోలో హాస్పిటల్స్‌ను అధిగమించి భారతదేశంలో అతి పెద్ద హాస్పిటల్ చైన్‌గా అవతరిస్తుంది.


బయోకాన్: ఊబకాయానికి సంబంధించిన ప్రముఖ ఔషధాల పేటెంట్ల గడువు ముగియడం ప్రారంభం కావడంతో, ఊబకాయం చికిత్సల్లో ఉపయోగించే ఔషధాల మార్కెట్‌లో వాటా చేజిక్కించుకోవడానికి ఈ కంపెనీ ముందు వరుసలో నిలిచింది.


టైటన్: ఆభరణాల ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌ వల్ల మార్చి త్రైమాసికం ఆదాయం 17 శాతం పెరిగిందని వెల్లడించింది.


అదానీ గ్రూప్: 2030 నాటికి పునరుత్పాదక ఇంధనం, తయారీ కోసం రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది.


విప్రో: కంపెనీ అమెరికా-1 యూనిట్‌కు అధిపతిగా ఉన్న శ్రీని, డెలాపోర్టే తర్వాత సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 


ZEE ఎంటర్‌టైన్‌మెంట్: ఉద్యోగుల్లో 15 శాతం మేర తొలగింపు కోసం ప్రతిపాదించింది. ఎంతమందిని తొలగిస్తారో వెల్లడించలేదు.


నెస్లే ఇండియా: రాబోయే ఐదేళ్లలో మాతృ సంస్థకు ఏడాదికి 0.15 శాతం చొప్పున రాయల్టీ చెల్లింపును పెంచడానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఫలితంగా ఇది 5.25 శాతానికి పెరుగుతుంది.


వొడాఫోన్ ఐడియా: ఒరియానా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.2,075 కోట్లకు, ఒక్కో షేరును రూ.14.87 చొప్పున 139.54 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు కంపెనీ బోర్డు శనివారం ఆమోదం తెలిపింది. కంపెనీ మూలధనాన్ని రూ.75,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్లకు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: నిబంధనలు పాటించనందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌పై రూ. 1 కోటి, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌పై రూ. 49.70 లక్షల జరిమానా విధించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.