Stocks to watch today, 17 April 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 90 పాయింట్లు లేదా 0.50 శాతం రెడ్‌ కలర్‌లో 17,781 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఏంజెల్ వన్, జస్ట్ డయల్, TV 18 బ్రాడ్‌కాస్ట్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


ఇన్ఫోసిస్: ఈ ఐటీ కంపెనీ, నాలుగో త్రైమాసికంలో బలహీన సంఖ్యలను నివేదించింది. స్థిర కరెన్సీ (CC) పరంగా దాని ఆదాయం QoQలో 3% క్షీణించింది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా 21%తో ఒత్తిడిలో ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో, గురువారం ఇన్ఫోసిస్ ADRs దాదాపు 9% క్షీణించాయి. సోమవారం ఈ స్టాక్ ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉంది.


HDFC బ్యాంక్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో HDFC బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 20% పెరిగి రూ. 12,047 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) ఏడాది ప్రాతిపదికన 24% పెరిగి రూ. 23,352 కోట్లకు చేరుకుంది.


GTPL హాత్‌వే: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 12 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అదే త్రైమాసికంలో రూ. 692 కోట్ల ఆదాయం వచ్చింది.


జైడస్ లైఫ్ సైన్సెస్: ఐసోప్రొటెరినాల్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్ల తయారీ, మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుండి జైడస్ లైఫ్ సైన్సెస్ తుది ఆమోదం పొందింది.


ZEE ఎంటర్‌టైన్‌మెంట్: నివేదికల ప్రకారం, ZEE ఎంటర్‌టైన్‌మెంట్‌లో 5.65% వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా ఓపెన్‌హైమర్ ‍‌(Openheimer) విక్రయించే అవకాశం ఉంది.


ముత్తూట్ ఫైనాన్స్: ఏప్రిల్ 13న, 225 మిలియన్‌ డాలర్ల మేర వాణిజ్య రుణాల ముందస్తుగానే ఈ కంపెనీ చెల్లించింది.


బ్రైట్‌కామ్: కంపెనీ లెక్కల్లో మోసం చేశారన్న ఆరోపణలతో బ్రైట్‌కామ్ గ్రూప్, దాని డైరెక్టర్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) షోకాజ్ నోటీసు కమ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


టాటా మెటాలిక్స్: ఆర్థిక ఫలితాలను ఆమోదించడానికి డైరెక్టర్ల బోర్డు సమావేశం కావాల్సి ఉన్నా, అనివార్య పరిస్థితుల కారణంగా రీషెడ్యూల్ చేయనున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మెటాలిక్స్ తెలియజేసింది. సవరించిన తేదీ త్వరలో తెలియజేస్తామని తెలిపింది. 


టొరెంట్ పవర్‌: కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & హోల్ టైమ్ కీ మేనేజర్ (పర్సనల్‌) పదవి నుంచి లలిత్ మాలిక్ ఏప్రిల్ 13 నుంచి వైదొలిగారు. సౌరభ్ మష్రువాలాను  కొత్త CFOగా ఏప్రిల్ 14 నుంచి కంపెనీ నియమించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.