Stocks to watch today, 30 December 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 57 పాయింట్లు లేదా 0.31 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,337 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


లోటస్ చాక్లెట్ కంపెనీ: BSE లిస్టెడ్ కంపెనీ అయిన లోటస్ చాక్లెట్ కంపెనీ (Lotus Chocolate Co) ప్రమోటర్ & ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీల్లో 51% వాటాను రూ. 74 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అదనంగా 26% వాటా కోసం పబ్లిక్ షేర్‌హోల్డర్‌లకు ఓపెన్ ఆఫర్ చేస్తుంది.


సిప్లా: ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని UK అనుబంధ సంస్థ సిప్లా (EU) లిమిటెడ్, Ethris GmbHలో 15 మిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టడానికి ఖచ్చితమైన ఒప్పందాల మీద సంతకం చేసింది. మెసెంజర్ RNA (mRNA) ఆధారిత చికిత్సల అభివృద్ధికి సిప్లా - ఎథ్రిస్ మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పెట్టుబడి మరింత ముందుకు తీసుకెళ్తుందని ఈ ఫార్మా కంపెనీ ప్రకటించింది.


క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్: డీఆర్ యాక్సియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో (DR Axion India Private Limited) 76% వాటాను రూ. 375 కోట్లకు కొనుగోలు చేసేందుకు కంపెనీ ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొనుగోలు వల్ల, రెండు ఎంటిటీలు తమ బలాన్ని పెంచుకోవడానికి, మెరుగైన సినర్జీలను నిర్మించుకోవడానికి వీలవుతుంది.


ఐషర్ మోటార్స్: స్పెయిన్‌కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ స్టార్క్ ఫ్యూచర్‌లో 10.35% వాటాను 50 మిలియన్ యూరోలకు కొనుగోలు చేసేందుకు ఐషర్ మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్ల విభాగంలో R&D డి సామర్థ్యాలను పెంపొందించడంలో ఈ పెట్టుబడి కంపెనీకి సహాయపడుతుంది. మార్చి నాటికి లావాదేవీ పూర్తవుతుందని భావిస్తున్నారు.


టాటా పవర్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా ఈ కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించింది. రూ. 1,000 కోట్ల విలువైన 10,000 అన్‌ సెక్యూర్డ్, రీడీమబుల్‌, టాక్సబుల్‌, లిస్టెడ్, రేటెడ్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDలు) కేటాయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ కంపెనీ తెలిపింది.


అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు ఈ కంపెనీకి చెందిన ఇద్దరు ప్రమోటర్లతో పాటు మరో ఇద్దరి పైన సెబీ రూ. 51.14 లక్షల జరిమానా విధించింది. ఇద్దరు ప్రమోటర్లు కరుటూరి సుబ్రహ్మణ్య చౌదరి, వల్లేపల్లి హనుమంత రావుతో పాటు పి.దుర్గా ప్రసాద్‌కు ఒక్కొక్కరికి రూ 11 లక్షలు... దేవళ్ల సత్య మాధవికి రూ 18.14 లక్షలు జరిమానాను రెగ్యులేటర్‌ విధించింది.


ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్: ఈ జీవిత బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో (AUM) రూ. 2.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. 


కేఫిన్ టెక్నాలజీస్: మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) Pte, గురువారం, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బ్లాక్ డీల్‌ ద్వారా కేఫిన్‌ టెక్నాలజీస్‌కు చెందిన 10 లక్షల షేర్లను ఒక్కొక్కటి రూ. 365.04 చొప్పున విక్రయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.