Stocks to watch today, 09 January 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 129 పాయింట్లు లేదా 0.72 శాతం రెడ్‌ కలర్‌లో 18,088 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ గ్యాప్‌ అప్‌లో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం, 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల (ఏప్రిల్‌-డిసెంబర్‌) ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి TCS డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమవుతుంది. ఫర్‌లాఫ్‌లు, సంవత్సరాంతపు సెలవుల ప్రభావం కారణంగా కంపెనీ ఆదాయంలో ఒక మోస్తరు వృద్ధిని కనబరుస్తుందని; మెరుగైన వినియోగం, తక్కువ వలసల రేటు కారణంగా లాభదాయకత QoQలో మెరుగుపడుతుందని భావిస్తున్నారు.


IDBI బ్యాంక్: కేంద్ర ప్రభుత్వం & LIC ఆధీనంలో ఉన్న ఈ బ్యాంక్‌లో, వాటాల వ్యూహాత్మక విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా 'ఎక్స్‌ప్రెషన్స్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'లను (EoIలు) అందుకుంది. ఒక కన్సార్టియం, రెండు విదేశీ బ్యాంకులు, ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ EoIs సమర్పించాయి.


శోభ లిమిటెడ్: డిమాండ్‌లో బలమైన పునరుద్ధరణ కారణంగా, 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సేల్స్‌ బుకింగ్స్‌ 36% (YoY) వృద్ధితో రూ. 1,424.7 కోట్లకు చేరింది. వాల్యూమ్ & విలువ రెండింటి పరంగా కంపెనీ చరిత్రలోనే ఇది రికార్డ్‌ స్థాయి త్రైమాసికం. యావరేజ్‌ ప్రైస్‌ రియలైజేషన్ YoYలో 22% మెరుగుపడి చదరపు అడుగులకు రూ. 9,650కి చేరుకుంది.


వన్97 కమ్యూనికేషన్స్ ‍‌(Paytm): మేనేజింగ్ డైరెక్టర్ & CEOగా సురీందర్ చావ్లాను నియమించడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ RBI నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్ అనుమతి పొందింది. అయితే, కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్‌ మీద నిషేధం కొనసాగుతోంది. 


కళ్యాణ్ జ్యువెలర్స్: భారతదేశం, మధ్యప్రాచ్యంలో జ్యూయలరీ షోరూమ్‌లను నడుపుతున్న కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 13% వార్షిక ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇంకా పూర్తి స్థాయి త్రైమాసిక ఫలితాలను ప్రకటించలేదు.


పంజాబ్ & సింధ్ బ్యాంక్: రుణాలలో బలమైన వృద్ధి నేపథ్యంలో, బ్యాంక్ త్వరలో రూ. 2 లక్షల కోట్ల వ్యాపార మైలురాయిని దాటుతుందని అంచనా వేస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ స్వరూప్ కుమార్ సాహా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంకు 17% రుణ వృద్ధితో రూ. 78,049 కోట్లను చేరుకుంది.


జిందాల్ స్టీల్ అండ్ పవర్: ఇటీవల కొనుగోలు చేసిన మోనెట్ పవర్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి కంపెనీ రూ. 1,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుందని జిందాల్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ బిమ్లేంద్ర ఝా తెలిపారు. వచ్చే 12 నుంచి 18 నెలల కాలంలో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు.


లుపిన్: ఫెసోటెరోడిన్ ఫ్యూమరేట్ టాబ్లెట్‌లను 4-mg & 8-mg పవర్‌తో అమెరికన్‌ మార్కెట్లోకి తీసుకురావడానికి US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి లుపిన్‌కు అనుమతి వచ్చింది. మూత్రాశయం చికిత్సకు ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.