విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శటీ మైదానంలో ఆదివారం రాత్రి ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నటి ఊర్వశీ రౌతేలా, కేథరిన్, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్, మాస్ మహారాజ్‌లు వేదికపై సందడి చేశారు. దీంతో అభిమానులు సంతోషంతో కేరింతలు కొట్టారు.


ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవిపై అభిమానంతో బాబీ గుంటూరు నుంచి మొదలయ్యాడు. చిరంజీవితో నా ప్రయాణం విజయవాడలో స్టార్టయ్యింది. అక్కడ నాకు ఒక గ్యాంగ్ ఉండేది. విజయవాడలో ఓ సినిమా ఫంక్షన్‌కు వెళ్లా. స్టేజ్ మీద చిరంజీవి, కోదండరామ రెడ్డి, భానుప్రియ కూర్చున్నారు. నేను చిరంజీవిని దగ్గర నుంచి చూడలేకపోయానని బాధేసింది. అప్పుడే నా గ్యాంగ్‌తో అన్నా.. ఒక రోజు నేను అక్కడికెళ్లి కుర్చుంటా అని శపథం చేశా. అక్కడి నుంచి మొదలై.. ఫస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్, ‘అన్నయ్య’ సినిమాలో తమ్ముడి క్యారెక్టర్. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’లో ఆయన పక్కన నటించే ఛాన్సు. చాలా గర్వంగా ఉంది. విజయవాడలో నేనిచ్చిన స్టేట్మెంట్ కంటే దాదాపు చంక ఎక్కి కూర్చున్నా. చిరంజీవి నన్ను ఎంతో ప్రేమిస్తారు, ఇష్టపడతారు. అన్నయ్య మిమ్మల్ని తొమ్మిదేళ్లు మిస్సయ్యం. మిస్ అవ్వద్దు ఇక. చిరంజీవి తనలో ఎంత బాధ ఉన్న బయటపెట్టరు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. నాకు పరిచయమైన తర్వాత ఒక్కరి గురించి కూడా ఆయన నెగటివ్‌గా చెప్పలేదు’’ అని అన్నారు. రవితేజ మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. 


విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్


విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు తొలుత అనుమతులు వస్తాయా? లేదా? అని కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఏయూ గ్రౌండ్స్ లో వేడుకకు అనుమతి ఇచ్చామని, ఆర్.కె.బీచ్‌లో ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు గురించి తమకు తెలియదని విశాఖ సీపీ తెలిపారు. అయితే, సముద్ర తీరంలో ఈవేడుక నిర్వహించడం రిస్క్ మాత్రమే కాదు, ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లే అవకాశం ఉండటంతో పోలీసులు ఏయూలో నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఏపీలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ తరలిరావడం విశేషం. ఈ నేపథ్యంలో చిరంజీవి పోలీసులకు, సీఎం కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు. 


జనవరి 13న థియేటర్లలో విడుదల


సంక్రాంతి బరిలో చివరగా థియేటర్లలోకి వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మెగా ఫ్యాన్స్, మాస్ మహారాజా ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. తొలుత తమ సినిమాకు థియేటర్లు, ప్రచారం విషయంలో అన్యాయం జరుగుతుందని కొంత కినుక వహించినా... ఇప్పుడు హ్యాపీగా ఉన్నారట. పాటలకు లభిస్తున్న స్పందన వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తోంది. 


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.