Paytm Clarification On Stake Sale To Adani Group: కష్టాల్లో ఉన్న ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎంలో కొంత వాటాను అదానీ గ్రూప్‌నకు అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త జాతీయ మీడియాలో వైరల్‌గా మారింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఫిన్‌టెక్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఒక వార్త ప్రచురించింది. ఇందుకోసం, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మతో అదానీ చర్చలు జరుపుతున్నారని, పేటీఎంలో వాటా దక్కించుకునే అవకాశం ఉందని ఆ వార్తలో రాసి ఉంది. ఈ వార్తతో, ఈ రోజు (బుధవారం, 29 మే 2024) పేటీఎం షేర్లు 5 శాతం పెరిగి, రూ. 359.45 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి.


ఈ ఉదయం క్లారిటీ ఇచ్చిన పేటీఎం
పేటీఎంలో వాటా కొనుగోలు కోసం గౌతమ్‌ అదానీ ప్రయత్నిస్తున్నారన్న వార్తపై ఆ ఫిన్‌టెక్ కంపెనీ స్పందించింది. ఆ కథనం పూర్తిగా తప్పని, ఊహించి రాశారని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని వివరిస్తూ, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEకి క్లారిటీ ఇచ్చింది. 


"పేటీఎంలో వాటా అమ్మకం వార్త కేవలం పుకారు మాత్రమే. పేటీఎంలో వాటా విక్రయం కోసం ఎవరితోనూ చర్చించడం లేదు. సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) చట్టం 2015లోని నిబంధనలకు అనుగుణంగా ఎప్పుడూ మేము నడుచుకుంటాం. సెబీ నియమాలకు అనుగుణంగా వ్యాపార విషయాలను ఎల్లప్పుడూ బహిర్గతం చేస్తాం" అని NSEకి పేటీఎం వెల్లడించింది.


ఈ పుకారు ఎలా పుట్టింది?
వాస్తవానికి, గౌతమ్ అదానీ - విజయ్ శేఖర్ శర్మ మంగళవారం అహ్మదాబాద్‌లో సమావేశం అయ్యారు. పేటీఎంలో వాటా విక్రయానికి సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అక్కడ చర్చలు జరిగాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గౌతమ్ అదానీ ఫిన్‌టెక్ రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారని, దాని కోసం అతను పేటీఎంలో వాటాను కొనుగోలు చేసే మార్గాన్ని ఎంచుకున్నట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' సహా కొన్ని జాతీయ పత్రికలు, మీడియా ఛానెళ్లు వార్తలు ఇచ్చాయి.


బీమా వ్యాపారానికి ఇటీవలే గుడ్‌బై
జనరల్ ఇన్సూరెన్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవలే పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది, ఈ విషయం గురించి బీమా నియంత్రణ సంస్థ IRDAIకి కూడా తెలియజేసింది. బీమా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలనే కోరికను వదులుకోవడంతో పాటు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ లైసెన్స్‌ను కూడా రద్దు చేసుకుంది. జనరల్ ఇన్సూరెన్స్‌లో సుమారు రూ. 950 కోట్ల పెట్టుబడి పెట్టాలని పేటీఎం గతంలో ప్లాన్ చేసింది. ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ నుంచి వైదొలగడం వల్ల కంపెనీకి ఆ డబ్బు ఆదా అవుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పీఎఫ్‌ విత్‌డ్రా కోసం అప్లై చేయడం చాలా ఈజీ, UAN లేకున్నా డబ్బు తీసుకోవచ్చు