Stock Market Update: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు (Russia-Ukraine crisis) అంతర్జాతీయ మార్కెట్లను వెంటాడుతున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరల పెరుగుదల ఆందోళన పెంచుతోంది. ఫలితంగా భారత మార్కెట్లు నేడు తీవ్ర ఒడుదొడుకుల్లో కదలాడాయి. మదుపర్లు అమ్మకాల బాట పట్టడంతో ఒకానొక సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1300 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 17,000 కీలక స్థాయిని కోల్పోయింది. మధ్యాహ్నం పుంజుకోవడంతో భారీ నష్టాల నుంచి మార్కెట్లు గట్టెక్కాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలూ నేడు పతనమయ్యాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 57,683 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,438 వద్ద నష్టాల్లో మొదలైంది. అరగంటలోనే సూచీ వేగంగా పతనమైంది. 56,394 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 1300 పాయింట్లు పతనమైంది. ఐరోపా మార్కెట్లు మొదలైన తర్వాత కోలుకొని 57,505 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 382 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 17,206 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,847 వద్ద మొదలైంది. వెంటనే అమ్మకాల సెగ మొదలవ్వడంతో 16,843 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 363 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత కోలుకొని 17,148 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 114 పాయింట్ల నష్టంతో 17,092 వద్ద ముగిసింది.


Bank Nifty


నిఫ్టీ బ్యాంకు 36,833 వద్ద మొదలైంది. వెంటనే నష్టాల్లోకి జారుకొని 36,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. దాదాపుగా 600 పాయింట్ల మేర నష్టపోయింది. మధ్యాహ్నం కోలుకొని 37,659 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. మొత్తంగా 313 పాయింట్ల నష్టంతో 37,371 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీలో 17 కంపెనీలు లాభాల్లో, 33 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హీరోమోటో కార్ప్‌, ఐచర్‌ మోటార్స్‌, హిందాల్కో లాభపడ్డాయి. టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ లైఫ్‌, టాటా మోటార్స్‌ నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాల సూచీలూ ఎరుపు రంగులోనే ముగిశాయి. ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు 1-3 శాతం వరకు పతనమయ్యాయి.