Stock Market News Today in Telugu: గ్లోబల్ మార్కెట్లన్నీ ఎర్ర జెండాలు చూపడంతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 06 మార్చి 2024) కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ 73,500 దిగువకు, NSE నిఫ్టీ 22,300 దిగువకు పడిపోయాయి. ఐటీ షేర్లు వరుసగా రెండో రోజూ తిరోగమనాన్ని కొనసాగించాయి. లార్జ్‌ క్యాప్‌ ఐటీ స్టాక్స్‌ ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 73,995 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 89.43 పాయింట్లు లేదా 0.12 శాతం క్షీణతతో 73,587.70 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 22,356 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 28.80 పాయింట్లు లేదా 0.13 శాతం బలహీనతతో 22,327.50 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ తలో 0.6 శాతం చొప్పున తగ్గాయి.


మార్కెట్‌ ప్రారంభంలో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో.. 8 షేర్లు లాభపడగా, 22 స్టాక్స్‌ క్షీణతలో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్ దాదాపు 1 శాతం పడిపోయాయి. మరోవైపు.. ఎస్‌బీఐ లైఫ్, గ్రాసిమ్, ఆర్‌ఐఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్ టాప్ గెయినర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి.


సెక్టార్ల వారీగా చూస్తే.. ఐటీ, మీడియా రంగాలు 1 శాతం దిగువన ఓపెన్‌ అయ్యాయి. ఫైనాన్షియల్స్‌ కొద్దిపాటి లాభాల్లో కనిపించాయి.


IPOల కోసం రుణాల మంజూరు చేయకుండా, షేర్లు & డిబెంచర్లు తాకట్టు పెట్టుకుని లోన్లు ఇవ్వకుండా JM ఫైనాన్షియల్స్‌ను RBI నిషేధించడంతో కంపెనీ షేర్లు 14% పతనమయ్యాయి.


ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా IIFL ఫైనాన్స్‌ ఈ రోజు కూడా 20% లోయర్‌ సర్క్యూట్‌లోకి వెళ్లింది.


ముంబైలో CNG ధరలను తగ్గించడంతో MGL షేర్లు 10% పడ్డాయి.


జొమాటోలో 17.64 కోట్ల షేర్లు లేదా 2 శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా యాంట్‌ఫిన్ సింగపూర్ హోల్డింగ్స్ పీటీఈ ఈ రోజు అమ్ముతుందన్న వార్తలతో కంపెనీ షేర్లు 2% పడిపోయాయి.


NTPC నుంచి రూ.9,500 కోట్లకు పైగా ఆర్డర్‌ గెలుచుకున్న BHEL షేర్లు 52-వారాల గరిష్ట స్థాయికి దగ్గరలో ఉన్నాయి.


32.2 కోట్ల షేర్లు చేతులు మారడంతో సంవర్దన్‌ మదర్సన్‌ స్టాక్ ప్రైస్‌ 3% జారిపోయింది.


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 199.78 పాయింట్లు లేదా 0.27% తగ్గి 73,672.51 దగ్గర; NSE నిఫ్టీ 53.65 పాయింట్లు లేదా 0.24% తగ్గి 22,351.95 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఏడాది చైనాలో ఐఫోన్ అమ్మకాలు 24 శాతం తగ్గడంతో, నిన్న, US మార్కెట్లలో ఆపిల్‌ షేర్లు 3 శాతం పడిపోయాయి. ఈ ఎఫెక్ట్‌తో నాస్‌డాక్‌ 1.65 శాతం పతనమైంది. డౌ జోన్స్, S&P 500 తలో 1 శాతం పడ్డాయి. భారత కాలమానం ప్రకారం, ఈ రోజు రాత్రి US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్, యూఎస్‌ కాంగ్రెస్‌లో కీలక ప్రసంగం చేస్తారు. ఇన్వెస్టర్లు దీనిపైనా దృష్టి పెడతారు. యూఎస్‌ మార్కెట్లలో నష్టాలతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా చిక్కటి ఎరుపు రంగు పులుముకున్నాయి. జపాన్ నికాయ్‌ ఇండెక్స్ 0.81 శాతం లోయర్‌ సైడ్‌లో ప్రారంభమైంది. టోపిక్స్ 0.44 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పి 0.39 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.55 శాతం తగ్గాయి. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 16,162.64 వద్ద ఫ్లాట్‌గా ట్రేడయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి