Stock Market News Today in Telugu: చాలా రోజుల తర్వాత, ఈ రోజు (శుక్రవారం, 01 మార్చి 2024) భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో మళ్లీ అర్ధవంతమైన పెరుగుదల కనిపించింది. ఇండియా Q3 జీడీపీ నంబర్‌ ఊహించిన దాని కంటే మెరుగ్గా రావడంతో.. దలాల్‌ స్ట్రీట్‌లో ఎలుగుబంట్లు వెనక్కు తగ్గాయి, ఎద్దులు ముందు వరుసలోకి వచ్చాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 72,500 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 106 పాయింట్లు లేదా 0.15 శాతం పెరుగుదలతో 72,606.31 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 21,983 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 65.50 పాయింట్లు లేదా 0.30 శాతం పెరుగుదలతో 22,048.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.7 శాతం, BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 1 శాతం పుంజుకున్నాయి. 


మార్కెట్‌ ఓపెనింగ్‌ సమయంలో, బ్యాంక్ నిఫ్టీ 388.45 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో 46,509 స్థాయి వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 స్టాక్స్‌ పచ్చగా ఉన్నాయి. బ్యాంకుల్లో టాప్ గెయినర్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇది 1.36 శాతం జంప్‌ చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1.35 శాతం, బంధన్ బ్యాంక్ 1.30 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ 1.11 శాతం, ఫెడరల్ బ్యాంక్ 1.03 శాతం బలంతో ట్రేడవుతున్నాయి.


నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌లను పరిశీలిస్తే... మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ మినహా మిగిలిన అన్ని సూచీలు గ్రీన్‌ జోన్‌లో పెరుగుతున్నాయి. ఆటో సెక్టార్‌ అత్యధికంగా 1.23 శాతం లాభపడింది.


మార్కెట్‌ ప్రారంభ సమయంలో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. లార్సెన్ అండ్ టూబ్రో 3 శాతం, టాటా స్టీల్, మహీంద్ర అండ్ మహీంద్ర, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2 శాతం చొప్పున పెరిగాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, పవర్ గ్రిడ్ కూడా టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. మరోవైపు, సన్ ఫార్మా 0.8 శాతం పడింది. 


ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 551.61 పాయింట్లు లేదా 0.76% పెరిగి 73,051.91 దగ్గర; NSE నిఫ్టీ 170.45 పాయింట్లు లేదా 0.84% పెరిగి 22,167.80 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియా మార్కెట్లలో జపాన్‌ నికాయ్‌ 1.3 శాతం పెరిగింది. మిగిలిన మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్ చేస్తున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభం కావొచ్చన్న అభిప్రాయాలు ద్రవ్యోల్బణం డేటా తర్వాత బలపడడంతో, నిన్న US మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. S&P 500, నాస్‌డాక్ తాజా రికార్డు గరిష్టాలను తాకాయి. ఒక దశాబ్దంలోనే అత్యధికంగా, ఫిబ్రవరిలో ఎక్కువ లాభాలతో క్లోజ్‌ అయ్యాయి. గురువారం నాస్‌డాక్ 0.9 శాతం, S&P 500 0.5 శాతం, డో జోన్స్‌ 0.1 శాతం పెరిగాయి. 


10-సంవత్సరాల US ట్రెజరీ బాండ్ ఈల్డ్ 4.264 శాతానికి తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు సుమారు $82 వద్ద తిష్టవేసింది. బిట్‌కాయిన్ వరుసగా రెండో రోజు కూడా 60,000 డాలర్ల మార్క్‌పైనే ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మహాశివరాత్రి ముందు చేదు కబురు, పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు