Stock Market Closing On 01 October 2024: ఇండియన్‌ స్టాక్స్‌ మార్కెట్లలో ఈ రోజు (మంగళవారం, 01 అక్టోబర్‌ 2024‌) ట్రేడింగ్‌ మొత్తం ఊగిసలాట ధోరణిలో కొనసాగింది. ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా ఈక్విటీ మార్కెట్ ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి జారిపోయాయి. ఆయిల్‌, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలే మార్కెట్లను దిగలాగాయి. ఐటీ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. అయినప్పటికీ BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో కొనుగోళ్ల కారణంగా కాస్తయినా ఉత్సాహం కనిపించింది. 


ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 33.49 పాయింట్లు లేదా 0.04 శాతం నష్టంతో 84,266.29 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13.95 పాయింట్లు లేదా 0.05 శాతం పతనంతో 25,796.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఉదయం సెన్సెక్స్‌ 84,257.17 దగ్గర, నిఫ్టీ 25,788.45 దగ్గర ఓపెన్‌ అయ్యాయి. 


పెరిగిన & పడిపోయిన షేర్లు 
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 14 షేర్లు లాభాలతో ముగియగా, 16 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లోని 21 స్టాక్స్‌ గెయిన్స్‌తో, 29 స్టాక్స్‌ లాస్‌లతో క్లోజ్‌ అయ్యాయి. టాప్‌ గెయినర్స్‌లో... టెక్ మహీంద్రా 2.93 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.22 శాతం, కోటక్ బ్యాంక్ 1.55 శాతం, ఇన్ఫోసిస్ 1.53 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.18 శాతం, ఎస్‌బీఐ 1.01 శాతం, అదానీ పోర్ట్స్ 0.93 శాతం, నెస్లే 0.68 శాతం, ICICI బ్యాంక్ 0.56 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.33 శాతం, TCS 0.32 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.12 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.93 శాతం లాభాలతో ముగిశాయి. టాప్‌ లూజర్స్‌లో.. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.64 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.54 శాతం, హెచ్‌యుఎల్ 1.03 శాతం, టాటా స్టీల్ 0.98 శాతం పతనంతో ముగిశాయి. 


సెక్టార్ల వారీగా...
ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్స్, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు పెరిగాయి. ఇంధనం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు పడిపోయాయి. కానీ, హై మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో అత్యంత ఉత్సాహం కనిపించింది. నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 204 పాయింట్ల జంప్‌తో 60,358 పాయింట్ల వద్ద, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 151 పాయింట్ల జంప్‌తో 19,331 పాయింట్ల వద్దకు చేరి స్థిరపడ్డాయి.


మార్కెట్ క్యాప్
ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ నష్టాలతో ముగిసినప్పటికీ, మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (Market Capitalization Of Indian Stock Market) పెరిగింది. గత సెషన్‌లో, బీఎస్‌ఈలో లిస్టయిన స్టాక్స్‌ మార్కెట్ క్యాప్ రూ.474.35 లక్షల కోట్ల వద్ద ముగిస్తే, ఈ రోజు రూ.474.98 లక్షల కోట్ల వద్దకు చేరింది. నేటి సెషన్‌లో మార్కెట్ క్యాప్‌లో రూ.63,000 కోట్లు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: అక్టోబర్ 01 నుంచి అతి పెద్ద మార్పులు - నేరుగా మీ పర్సుపైనే ప్రభావం