Sensex And Nifty At Fresh All-time High: ప్రపంచ మార్కెట్ల నుంచి లభిస్తున్న సపోర్ట్‌తో ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 20 సెప్టెంబర్‌ 2024) బ్లాక్‌బస్టర్స్‌ అయ్యాయి. మార్కెట్‌ మహా బుల్లిష్‌ ట్రెండ్‌ నడుస్తోంది. శుక్రవారం నాడు, వరుసగా రెండో రోజు కూడా సూచీలు సరికొత్త ఆల్ టైమ్ హైస్‌ను టచ్‌ చేశాయి. ఈ ఉదయం ట్రేడ్‌ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, కొద్దిసేపటికే మార్కెట్లో విపరీతమైన ర్యాలీ ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారిగా 84,000 మార్క్‌ను దాటింది.


గురువారం నాడు 83,185 దగ్గర క్లోజ్‌ అయిన సెన్సెక్స్‌, ఈ రోజు 421 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 83,603.04 దగ్గర (BSE Sensex Opening Today) ప్రారంభమైంది. నిన్న 25,416 క్లోజ్‌ అయిన నిఫ్టీ, ఈ రోజు 112 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 25,525.95 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ఓపెన్ అయింది.


ఉదయం ట్రేడ్‌ కాస్త స్లోగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత సీన్‌ మారిపోయింది. మార్కెట్‌ ప్రారంభమైన దాదాపు గంట తర్వాత, ఉదయం 10.15 నుంచి వన్‌సైడ్‌ మూమెంట్‌ మొదలైంది. అక్కడి నుంచి, సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను వెతుక్కుంటూనే వెళ్లాయి. ఉదయం 10.40 సమయంలో సెన్సెక్స్ 84,000 పాయింట్లను చేరింది. సెన్సెక్స్ 84,000 పాయింట్ల స్థాయిని దాటడం స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. 84,515.10 వద్ద సెన్సెక్స్‌ కొత్త లైఫ్‌టైమ్‌ హైని ‍(Sensex at fresh all-time high) టచ్‌ చేసింది.


నిఫ్టీలోనూ రికార్డ్‌ హైస్‌ నమోదవుతూనే ఉన్నాయి, పాత రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. నిఫ్టీ 25,800 స్థాయిని దాటి 25,806.95 వద్ద తాజా జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) చేరింది.


నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్స్, ఎనర్జీ షేర్ల నుంచి దేశీయ మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. ఈ రంగాల షేర్లకు అద్భుతమైన డిమాండ్‌ & విపరీతమైన కొనుగోళ్లు జరిగాయి. ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడిని అధిగమించడానికి మార్కెట్‌కు ఇవి సాయం చేశాయి. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు తలో 4 చొప్పున జంప్‌ చేశాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ 2 శాతానికి పైగా ఎగబాకాయి. సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టీసీఎస్ మూడు షేర్లు మాత్రమే ప్రతికూలంగా ట్రేడ్ అవుతున్నాయి.


బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ వరకు ప్రధాన సూచీలు తాజా ఆల్-టైమ్ గరిష్టాలకు చేరాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా 53,711.90 వద్ద తాజా గరిష్టాన్ని తాకింది, మునుపటి రికార్డు 53,357ను బద్ధలు కొట్టింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ దాని మునుపటి రికార్డు 24,584తో పోలిస్తే ఈ రోజు 24,643 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్‌లో ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకులు కలిసి వచ్చాయి, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌ తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 26,910ని తాకింది.


అయితే, మధ్యాహ్నం ఐరోపా షేర్‌మార్కెట్లు లోయర్‌ లెవెల్స్‌లో ఓపెన్‌ కావడంతో ఆ ప్రభావం ఇండియన్‌ మార్కెట్లపైనా పడింది. మధ్యాహ్నం నుంచి మన మార్కెట్లో ఫాల్‌ మొదలైంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.