Sebi Action Against Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కఠిన చర్యలు తీసుకుంది. మార్కెట్‌ రెగ్యులేటర్ (SEBI) అతనిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు నిషేధం విధించింది. దీంతోపాటు అనిల్ అంబానీకి సెబీ కోటి రూపాయల భారీ జరిమానా కూడా విధించింది. కంపెనీ నిధుల మళ్లింపు కేసులో ఇంతటి భారీ షాక్‌ ఇచ్చింది.


అనిల్ అంబానీతో పాటు మరికొందరిపైనా చర్యలు
రెగ్యులేటర్ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలపైనా సెబీ చర్య తీసుకుంది. ఈ లిస్ట్‌లో... రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు (Reliance Home Finance Ltd - RHFL) చెందిన చాలా మంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. సెబీ విధించిన 5 సంవత్సరాల 'బ్యాన్‌', ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. 


ఏ లిస్టెడ్ కంపెనీలోనూ ఉద్యోగం దొరకదు
5 ఏళ్ల నిషేధంతో పాటు మార్కెట్ రెగ్యులేటర్ అనిల్ అంబానీకి రూ.25 కోట్ల భారీ జరిమానా కూడా విధించింది. అంతేకాదు, అనిల్ అంబానీ ఏ లిస్టెడ్ కంపెనీలోనూ, సెబీలో రిజిస్టర్‌ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో మేనేజర్ స్థాయి పదవిని చేపట్టకుండా నిషేధం విధించింది.


రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై చర్యలు
రెగ్యులేటర్ స్కానర్‌లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కూడా ఉంది. ఈ కంపెనీని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 6 నెలల పాటు బ్యాన్‌ చేసింది. అలాగే, రూ.6 లక్షల జరిమానా విధించింది.


కంపెనీ సొమ్ము దుర్వినియోగం
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో మేనేజర్ హోదాలో ఉన్న వ్యక్తుల ద్వారా అనిల్ అంబానీ నిధులను మళ్లించారని, మోసానికి పాల్పడ్డారని సెబీ వెల్లడించింది. అనిల్‌ అంబానీ నిధులను దుర్వినియోగం చేసిన తీరు, తాను తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ 222 పేజీల తుది ఆర్డర్‌ జారీ చేసింది. అనిల్‌ అంబానీ తన గ్రూప్‌లోని అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో RHFL నుంచి డబ్బును మళ్లించారని ఆ నివేదికలో సెబీ తెలిపింది. దీనికోసం కంపెనీలోని మేనేజర్ల సాయం తీసుకున్నారని తెలిపింది. ఆ తరహా కార్యకలాపాలపై కంపెనీ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని సెబీ పేర్కొంది. కంపెనీ కార్యకలాపాల్లో ఇది తీవ్రమైన అక్రమ పద్ధతిగా రెగ్యులేటర్ పరిగణించింది.


RHFL నుంచి రుణాలు రూపంలో డబ్బు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించటంలో విఫలమయ్యాయని సెబీ వెల్లడించింది. ఫలితంగా RHFL దివాలా తీసిందని వివరించింది. దీనివల్ల షేర్‌ ధరలు అత్యంత భారీగా పడిపోయి షేర్‌ హోల్డర్లు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించింది. ఇప్పటికీ, దాదాపు 9 లక్షల మంది షేర్‌హోల్డర్ల పెట్టుబడి నష్టాల్లో ఉందని వివరించింది.


అనిల్ అంబానీతో పాటు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు అమిత్ బాప్నా (రూ. 26 కోట్లు), రవీంద్ర సుధాల్కర్ (రూ. 26 కోట్లు) పింకేష్ ఆర్ షా (రూ. 21 కోట్లు) మీద కూడా సెబీ జరిమానా విధించింది. వీరికి కూడా స్టాక్‌ మార్కెట్‌ నుంచి నిషేధం వర్తిస్తుంది. వీళ్లతో పాటు... రిలయన్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజెస్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీంజెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌పై తలో రూ.25 కోట్ల జరిమానా విధించింది.


మరో ఆసక్తికర కథనం: ప్రపంచంలోనే ధనిక గ్రామం, మైండ్‌ బ్లాంక్‌ అయ్యే విశేషాలు - మన దేశంలోనే ఉందా ఊరు